హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జయేశ్ రంజన్ అన్నారు. సఫా సొసైటీ సహకారంతో వీ హబ్ చేపడుతున్న ‘ఉజాగర్’ ప్రాజెక్టును శనివారం వీ హబ్ కార్యాలయంలో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించి మైనార్టీ మహిళలు వ్యాపారంలో రాణించడంలో సహాయపడేందుకు ఉజాగర్ కార్యక్రమాన్ని వీ హబ్ అమలుచేస్తున్నదని తెలిపారు. వినూత్న ఆలోచనలు, పరిష్కారాలతో మహిళలు సామాజికంగా, ఆర్థికంగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఉజాగర్ కార్యక్రమంలో భాగంగా వచ్చే 17 నెలల కాల వ్యవధిలో 150 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. వీ హబ్ సీఈవో దీప్తి రావుల మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా చేపట్టిన వీ హబ్తో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇప్పటివరకు 3,194 స్టార్టప్లకు దన్నుగా నిలిచినట్లు తెలిపారు. వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న మైనార్టీ మహిళలకు ఉజాగర్ కార్యక్రమంలో అకౌంటింగ్, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలపై నైపుణ్యతను కల్పించి గ్లోబల్ మార్కెట్లో వ్యాపార వేత్తలుగా ఎదిగేందుకు సహకారం అందిస్తామన్నారు.