హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నిధులు లేక సతమతమవుతున్న స్టార్టప్లను ఆర్థికంగా ఆదుకోవడానికి ‘వీ ఫౌండర్ సర్కిల్’ ముందుకొచ్చింది. ఇప్పటికే పదుల సంఖ్యలో స్టార్టప్ల్లో ఇన్వెస్ట్ చేసిన ఈ ముంబైకి చెందిన సంస్థ..తాజాగా వచ్చే ఏడాదిలో 200 స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో జరుగుతున్న టై గ్లోబల్ సమ్మిట్-2022లో భాగంగా నగరానికి వచ్చిన కంపెనీ ప్రతినిధులు నీరజ్ త్యాగి, గౌరవ్ వీకే సింఘ్వీలు ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా స్టార్టప్ల శకం ప్రారంభమైందని, 2023లో దేశీయంగా 200కి పైగా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు నీరజ్ త్యాగీ ప్రకటించారు. వీటిలో తెలంగాణ నుంచి కనీసం ఎనిమిది స్టార్టప్లు ఉండనున్నాయన్నారు.
వచ్చే ఐదేండ్లలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లకు చెందిన 50 స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటి వరకు సంస్థ 72 స్టార్టప్ల్లో ఇన్వెస్ట్ చేసింది. వీటిలో 25 స్టార్టప్లు మహిళా సారథ్యంలో నడుస్తున్నవి కావడం విశేషం. ఆటో సర్వీస్, వెబ్ 3, సాస్(ఎస్ఎఎఎస్) వంటి స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామన్నా ఆయన.. తాము పెట్టుబడులు పెట్టి విజయవంతంగా కొనసాగుతున్న స్టార్టప్లలో హెసా(హెచ్ఈఎస్ఎ), కస్మాట్లు ఉన్నాయని తెలిపారు. దేశంలో పెరుగుతున్న టెక్ హబ్కు ఇది దోహదం చేస్తుంది. ఇప్పటి వరకు స్టార్టప్లు అంటే బెంగళూరు అన్న ముద్ర ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు హైదరాబాద్ చేరింది.