Air India | విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటన మీద ఎయిర్ ఇండియా మాతృసంస్థ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నవంబర్ 26వ తేదీన న్యూయార్క్-ఢిల్లీ విమానంలో జరిగిన ఈ ఘటనపై మరింత వేగంగా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందని పేర్కొన్నారు.
ఆ విషయంలో ఎయిర్ ఇండియా వెనుక బడిందని చంద్రశేఖరన్ అంగీకరించారు. ఈ సమస్య పరిష్కారానికి తాము సరిగ్గా స్పందించలేకపోయామని ఆదివారం చెప్పారు. ఈ ఘటన తనకు, తమ ఎయిర్ ఇండియా సహోద్యోగులకు తీవ్ర వేదన కలిగించిందన్నారు. గతేడాది నవంబర్ 26న జరిగిన ఈ విపరీత ఘటనపై టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తొలి స్పందన ఇది.
ప్రయాణికుల భద్రతకు ఎయిర్ ఇండియా, టాటా సన్స్ కట్టుబడి ఉన్నాయని చంద్రశేఖరన్ అన్నారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరక్కుండా.. ప్రతి దశలో లోతుగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమెరికా ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ వెల్స్ ఫార్గో వైస్ప్రెసిడెంట్గా ఉన్న శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు గత నవంబర్ 26న అదే విమానంలో ప్రయాణిస్తున్న వృద్ధ మహిళపై మూత్రం పోశాడు.
ఈ ఘటనపై బాధితురాలు.. ఎయిర్ సేవ పోర్టల్, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ప్రయాణికుడు మూత్రం పోసిన సంగతి విమాన క్రూ సిబ్బంది.. దీనిపై సదరు వ్యక్తితో తనను మాట్లాడాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన తమ దృష్టికి ఈ నెల నాలుగో తేదీన వచ్చిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ నెల ఐదో తేదీన వెల్లడించింది.
సంబంధిత శంకర్ మిశ్రా మద్యం మత్తులో ఉన్నాడని, దీనిపై సిబ్బంది దృష్టికి తెచ్చినా స్పందించలేదని అతడి పక్కనే ఉన్న డాక్టర్ ఆరోపించారు. తన కొడుకు మిశ్రా అమాయకుడని అతడి తండ్రి వాదిస్తున్నందు వల్లే తాను మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. ఎయిర్ ఇండియాకు రాత పూర్వకంగా సదరు డాక్టర్ ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన వెలుగు చూడటంతో ఈ నెల ఆరో తేదీన వెల్స్ ఫార్గో.. శంకర్ మిశ్రాను తొలగించింది. అతడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన వెలుగు చూసినప్పటి నుంచి బెంగళూరులో దాచుకున్న శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మరోవైపు విమాన పైలట్, ఇతర సిబ్బందికి ఎయిర్ ఇండియా నోటీసులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు వారికి రోస్టర్ విధులు కేటాయించకుండా పెండింగ్లో పెట్టింది.