Smart Phone Sales | దేశీయంగా వరుసగా మూడో త్రైమాసికంలోనూ స్మార్ట్ ఫోన్లు.. అందునా 5జీ సామర్థ్యం గల స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పెరిగాయి. 2024 తొలి త్రైమాసికంలో అత్యధిక ఫోన్లను విక్రయించిన బ్రాండ్గా చైనాకు చెందిన వివో నిలిచింది. ఇంతకుముందు టాప్లో కొనసాగిన శాంసంగ్ను దాటేసి వివో ముందుకు వచ్చిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) వరల్డ్ వైడ్ క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది. మోటరోలా తీసుకొచ్చిన చౌక స్మార్ట్ ఫోన్.. మార్చి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పెరగడానికి కారణమైంది. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ‘ఐ-ఫోన్’ విక్రయాలు 19 శాతం పుంజుకుంటే, శాంసంగ్ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చినా.. తనదైన ముద్ర వేయలేకపోయింది.
2024 మార్చి త్రైమాసికంలో భారత్లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 11 శాతం పెరిగి 3.4 కోట్లకు చేరాయి. కొత్త స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణ, ప్రమోషనల్ ఆఫర్ల పెరుగుదల, మైక్రో ఫైనాన్సింగ్ స్కీంలతో మార్చి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పుంజుకున్నాయి.ఆఫ్ లైన్, ఆన్ లైన్ చానల్స్లో విక్రయాలతో మార్చి త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో వివో వాటా 16.2 శాతం, శాంసంగ్ 13.3 శాతం కలిగి ఉన్నాయి. గతేడాది మార్చి త్రైమాసికంలో 2.4 శాతం మార్కెట్ వాటా కలిగిన మోటరోలా ఈ ఏడాది 110 శాతం గ్రోత్తో 4.6 శాతానికి చేరుకున్నది. పొకో, వివోలతోపాటు లెనోవో సొంత బ్రాండ్ కలుపుకుంటే ఆన్ లైన్ చానెళ్లలో ఫోన్ విక్రయాల్లో మొత్తం 65 శాతం వాటా కలిగి ఉన్నాయి. సగటున భారత్ ఫోన్ల విక్రయాల్లో ఐ-ఫోన్15, ఐ-ఫోన్ 14 ఫోన్లు 56 శాతం వాటా కలిగి ఉన్నాయి.