Air India : భారతదేశ విమానయాన రంగంలో భారీ ఒప్పందం కుదిరింది. టాటా సన్స్ కంపెనీకి చెందిన ఎయిర్ ఇండియాలో సింగపూర్ విమాన కంపెనీ విస్తారా విలీనం కానుంది. విస్తారాను, ఎయిర్ ఇండియాలో కలిపేందుకు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ మంగళవారం అంగీకరించాయి. ఈ ఒప్పందలో భాగంగా ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దాంతో, ఎయిర్ ఇండియా గ్రూప్లో సింగపూర్ విమానయాన సంస్థకు 25.1 శాతం వాటా అందనుంది. ఎయిర్ ఇండియా, విస్తారా విలీనం ప్రక్రియను 2024 మార్చి కల్లా పూర్తి చేయాలనే ఉద్దేశంతో టాటా కంపెనీ ఉంది. టాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ కలిసి విస్తారాను నడిపిస్తున్నాయి. ప్రస్తుతం విస్తారాలో టాటా కంపెనీకి 51 శాతం వాటా ఉంది.
ఏడాది క్రితం రూ.18,000 కోట్లతో టాటాసన్స్ కంపెనీ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. టాటా కంపెనీ తక్కువ ధరకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియా సర్వీసులు నడుపుతోంది. వచ్చే రెండేళ్లలో ఈ రెండింటిని కూడా విలీనం చేయనుంది. దాంతో ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్య 218కి చేరనుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 113, ఎయిర్ ఆసియాలో 28, విస్తారాలో 58, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో 24 విమానాలు ఉన్నాయి.