ముంబై, ఫిబ్రవరి 12: దేశంలోని టాప్ 500 ప్రైవేట్ రంగ సంస్థల విలువ రూ.231 లక్షల కోట్లు (2.8 ట్రిలియన్ డాలర్లు)గా ఉన్నట్టు సోమవారం విడుదలైన హురున్ ఇండియా-యాక్సిస్ బ్యాంక్ 2023 అత్యంత విలువైన సంస్థల జాబితా స్పష్టం చేసింది.
ఇది సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ దేశాలన్నిటి జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం. అలాగే భారత జీడీపీ విలువలో 71 శాతానికి సమానమని కూడా ఈ రిపోర్టు పేర్కొన్నది. ఇక గత ఏడాదికిగాను వచ్చిన ఈ నివేదికలో స్టాక్ మార్కెట్లలో నమోదైనవి, కాని కంపెనీలూ ఉన్నాయి.
మూడోసారీ రిలయన్సే
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) దేశంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ రంగ సంస్థ అని తాజా రిపోర్టు పేర్కొన్నది. నిరుడు అక్టోబర్ నాటికి దీని విలువ రూ.15.65 లక్షల కోట్లుగా ఉన్నది. దీంతో వరుసగా మూడో ఏడాదీ రిలయన్స్కే అగ్రస్థానం దక్కింది.
రూ.12.4 లక్షల కోట్లతో రెండో స్థానంలో దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ ఉండగా, రూ.11.3 లక్షల కోట్లతో మూడో స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం ఇందుకు కలిసొచ్చినట్టు హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్, యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌధరి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ముంబై టాప్
ఈ టాప్ 500 ప్రైవేట్ రంగ సంస్థలు దేశంలోని 44 నగరాలకు చెందినవి. అయితే ఇందులో అత్యధికం దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చెందినవే. 156 ఉన్నాయి. బెంగళూరుకు చెందినవి 59 ఉండగా, న్యూఢిల్లీకి చెందినవి 39 ఉన్నాయి. కాగా, వాల్యూ క్రియేటర్లలో సుజ్లాన్ ఎనర్జీ వాల్యూ గ్రోత్ గరిష్ఠంగా 436 శాతంగా ఉన్నది. మేఘా ఇంజినీరింగ్ వాల్యూ గ్రోత్ 150 శాతం. జాబితాలో 76 ఆర్థిక సేవల సంస్థలున్నాయి. తర్వాతి స్థానంలో ఆరోగ్య సంరక్షణ (58), కన్జ్యూమర్ గూడ్స్ (38) రంగాల కంపెనీలున్నాయి.