న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: అదానీ గ్రూప్ రుణాల ఊబిలో కూరుకున్నదని, దానికి ఉండాల్సిన రుణాలకంటే మూడు రెట్లు అధికంగా ఉన్నాయని వాల్యుయేషన్ గురు అశ్వథ్ దామోదరన్ వ్యాఖ్యానించారు. ఇలా రుణాలు విచ్ఛలవిడిగా సమీకరించడం చెత్త వ్యాపార ప్రక్రియగా అభివర్ణించారు. న్యూయార్క్లోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్న దామోదరన్ తాజాగా ఒక బ్లాగ్పోస్ట్లో అదానీపై రాస్తూ ‘భారీ రుణాలపై అయ్యే వ్యయంతో (వడ్డీ చెల్లింపులు) పోలిస్తే అదానీకి చేకూరే ప్రయోజనం నామమాత్రమే.
ఈ రుణాలను వేరొకరు (ప్రభుత్వం, నిర్లక్ష్యపు బ్యాంకర్లు, గ్రీన్బాండ్హోల్డర్లు) పూడిస్తేతప్ప విపరీతమైన రిస్క్ ఉంటుంది’ అని తెలిపారు. ‘నా విశ్లేషణ ప్రకారం అదానీ ఎంటర్ప్రైజెస్కు రుణం భారీగా ఉంది. ఆ కంపెనీకి గరిష్ఠంగా ఉండాల్సిన రుణం రూ.1,85,309 మిలియన్లుకాగా, వాస్తవానికి రెట్టింపుకంటే ఎక్కువగా రూ.4,13,443 మిలియన్ల రుణం ఉంది. రుణం తగ్గించుకుంటే వైఫల్యం చెందే రిస్క్ తగ్గడంతో పాటు ఆ కంపెనీ రుణ వ్యయం కూడా తగ్గుతుంది.
గ్రూప్లో అధిక రుణభారం కలిగిన కంపెనీ…తక్కువ రుణం ఉన్న మరో గ్రూప్ కంపెనీని సైతం దెబ్బతీస్తుంది’ అని దామోదరన్ వివరించారు. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ వాస్తవ విలువ రూ. 945 మాత్రమేనంటూ కొద్ది రోజుల క్రితం దామోదరన్ ఒక బ్లాగ్పోస్టులో రాసిన సంగతి తెలిసిందే. తన విశ్లేషణకు అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్లో ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం కంపెనీ ఫండమెంటల్ విలువనే గణించానని ఆయన తెలిపారు.
6,500 కోట్ల రుణాన్ని చెల్లిస్తాం
ఈ ఏడాది మార్చి చివరికల్లా 790 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 6,540 కోట్లు) రుణాన్ని చెల్లించాలని అదానీ గ్రూప్ యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. షేర్లను తనఖా చేసిన రుణాల్ని చెల్లిస్తుందని సమాచారం. హాంకాంగ్లో మంగళవారం జరిగిన గ్రూప్ బాండ్హోల్డర్ల సదస్సులో ఈ మేరకు అదానీ యాజమాన్యం ప్రెజెంటేషన్ ఇచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అదానీ గ్రూప్ తన రుణ చెల్లింపులకు రీఫైనాన్స్ తీసుకోవడం, మూలధనాన్ని పెట్టుబడి చేయబోం.
– జుగేషిందర్ సింగ్, అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్