అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు తక్కువ మోతాదులోనే ఉంటుందంటూ ఫెడరల్ రిజర్వ్ కమిటీ మీటింగ్ మినిట్స్ ద్వారా వెల్లడికావడంతో గత వారం ఆ దేశపు సూచీల ర్యాలీ ప్రభావం ఇక్కడ కూడా కన్పించింది. దానికి తోడు డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజైన గురువారం భారీ షార్ట్ కవరింగ్తో బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త రికార్డుస్థాయికి చేరింది. అయితే మార్కెట్ బ్రేక్అవుట్ను నిర్దేశించగల ఎన్ఎస్ఈ నిఫ్టీ మాత్రం ఆల్టైమ్ గరిష్ఠస్థాయికి సమీపంలో 18,513 పాయింట్ల వద్ద నిలిచి ఉంది.
మార్కెట్ పెట్టుబడుల్ని శాసించే ఈ సూచీ పటిష్ఠంగా బ్రేక్ అయ్యేంతవరకూ ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడం మంచిదని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ సూచించారు. ప్రస్తుత స్థాయి వద్ద ప్రపంచంలోకెల్లా భారత్ ఖరీదైన మార్కెట్గా ట్రేడవుతున్నదని, అయినా విదేశీ ఇన్వెస్టర్లు వృద్ధిని విశ్వసిస్తున్నారని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ చెప్పారు. ఈ వారం వెలువడనున్న భారత్ జీడీపీ గణాంకాలు, డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ కదలికల ఆధారంగా ట్రెండ్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ వారం నిఫ్టీని తొలుత 18,600-18,690 శ్రేణి నిరోధించవచ్చని వైష్ణవ్ అంచనా వేశారు. 18,400 వద్ద తక్షణ మద్దతును పొందవచ్చని, ఆ దిగువన 18,250 పాయింట్ల సమీపంలో గట్టి మద్దతు ఉన్నదన్నారు. నిఫ్టీ గత ఏడాది అక్టోబర్లో సాధించిన 18,604 పాయింట్ల స్థాయిని బ్రేక్ చేస్తే తదుపరి 18,800 వరకూ పెరగవచ్చని, 18,440, 18,300 స్థాయిల వద్ద మద్దతు పొందవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్స్ అనలిస్ట్ సంతోష్ మీనా తెలిపారు. అయితే నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు 150 పాయింట్ల ప్రీమియంతో కోట్కావడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
మార్కెట్ మూమెంటం సైడ్వేస్ నుంచి బుల్లిష్గా మారిందని, ఈ వారం నిఫ్టీ 18,650 స్థాయిని అందుకోవచ్చని, అటుపైన 18,800 ర్యాలీ జరపవచ్చని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ అంచనా వేశారు. 18,250, 18,100 పాయింట్ల స్థాయిలు మద్దతుగా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం మార్కెట్ ఓవర్బాట్గా కన్పిస్తున్నదని, పాజిటివ్ ట్రెండ్ కొనసాగాలంటే నిఫ్టీ 18,442 పాయింట్లపైన స్థిరపడాలని కేఆర్ చోక్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హేమన్ కపాడియా చెప్పారు.