Vaikuntha Dwara Darshanam | తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా వన్ ప్లస్ త్రీ విధానంలో టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం ఇచ్చింది.
తొలి మూడురోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ ఒకటి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in, మొబైల్ యాప్, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్బాట్లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్లో వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పింది. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు డిప్ వివరాలు ప్రకటించనున్నట్లు చెప్పింది. వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెం: 9552300009కు ముందుగా గోవిందా, హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం ఇంగ్లీష్, తెలుగు భాషలను సెలక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లే ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ పేర్కొంది. అనంతరం మీరు ఎంచుకున్న భాషలో సర్వీసెస్ విండో కనిపిస్తుంది. ఆ సర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయగానే వైకుంఠ ద్వార దర్శనం (డిప్) రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలను ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయాలి.
అనంతరం డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో దర్శనం కావాల్సిన రోజులను, మూడు రోజులను ప్రయారిటీగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు టీడీపీ పేర్కొంది. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలని.. ఆ తర్వాత వివరాలను సరి చూసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని.. ఒకసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి వీలుండదని స్పష్టం చేసింది. ఆధార్ నంబర్, పిన్ కోడ్ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. భక్తుల వివరాలు విజయవంతంగా SUBMIT చేయగానే ACKNOWLODGEMENT మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రిఫరెన్సు నెంబర్గా పరిగణించనున్నట్లు తెలిపింది. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుందని వెల్లడించింది.
తొలిమూడురోజులు స్పెషల్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు రద్దు.. వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడురోజుల్లో స్పెషల్ ఎంట్రీ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఈ పది రోజుల పాటు తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయబోమని స్పష్టం చేసింది. వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుంచి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పిస్తామని చెప్పింది. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందని.. ఈ రోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవని స్పష్టం చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుంచి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నది టీటీడీ. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు చెప్పింది.
వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేస్తామని చెప్పింది. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి , రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించినట్లు చెప్పింది. ఈ టోకెన్లు డిసెంబర్ 10 తేదిన ఆన్లైన్లో విడుదలవుతాయని.. ఒక్కో వ్యక్తి వన్ ప్లస్ త్రీ విధానంలో టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఆయా రోజుల్లో తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని.. ఆయా రోజుల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేయనున్నట్లు చెప్పింది.
రూ.కోటికిపై విరాళం ఇచ్చిన దాతలు వారి కుటుంబ సభ్యులకు డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు రోజుకు 125 మందికి దర్శనం కల్పించనున్నారు. రూ.లక్ష నుంచి రూ.99 లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు డిసెంబర్ 30, 31 వ తేదిల్లో రోజుకు 1000 మందికి, జనవరి 1 నుంచి 8 వరకు రోజుకు 2వేల మందికి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. వారంతా ఆన్లైన్లో అప్లికేషన్లో డిసెంబర్ 5వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్లను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాలను గమనించి సహకరించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.