Hyderabad | అభివృద్ధి ఎక్కడుంటే అక్కడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అందుకే హైదరాబాద్కు దేశ, విదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఇక్కడున్న కంపెనీలూ విస్తరిస్తున్నాయి.తాజాగా ప్రముఖ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ కంపెనీ యూఎస్టీ సైతం మరో కొత్త సెంటర్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. దీంతో 2వేల మందికి కొలువులు రానున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 22 (బిజినెస్ బ్యూరో): హైదరాబాద్.. మరో భారీ ఆఫీస్కు వేదికైంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ సంస్థ యూఎస్టీ.. నగరంలో నూతన కార్యాలయాన్ని తెరిచింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, యూఎస్టీ సీఈవో కృష్ణ సుధీంద్ర దీన్ని సంయుక్తంగా ప్రారంభిం చారు. సంస్థ సీవోవో అలెగ్జాండర్ వర్ఘీస్, సీవీవో సునీల్ బాలకృష్ణన్ ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, విస్తరణ ప్రణాళికలో భాగంగా ఇక్కడి క్యాపిటల్యాండ్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో దీన్ని తీసుకొచ్చింది. 1.18 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటైన ఈ అత్యాధునిక క్యాంపస్తో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి. వచ్చే 2-3 ఏండ్లలో కొత్తగా 2వేల మందికిపైగా కొలువులు వస్తాయని సంస్థ ప్రతినిధులు బుధవారం తెలియజేశారు. ఇప్పటికే ఈ కంపెనీకి 2వేల మంది ఉద్యోగులుండగా, దీంతో ఆ సంఖ్య 4వేలకు చేరనున్నది.
వేగంగా విస్తరణ..
హైదరాబాద్లో యూఎస్టీ కార్యకలాపాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. 2018లో ఇక్కడ యూఎస్టీ కార్యకలాపాలు 250 మంది ఉద్యోగులతో మొదలయ్యాయి. 2021లో ఉద్యోగులు వెయ్యి మందిని దాటిపోగా.. ఇప్పుడు 2వేల మంది పనిచేస్తుండటం గమనార్హం. నిజానికి దేశవ్యాప్తంగా యూఎస్టీకి సెంటర్లున్నాయి. హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, పుణె, కోయంబత్తూర్, హోసూర్, ఢిల్లీ-ఎన్సీఆర్లలో సాఫ్ట్వేర్ డెలివరీ, డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయితే హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్లనే సంస్థ వేగంగా విస్తరిస్తూపోతుండటం విశేషం.
ముఖ్యంగా యూఎస్టీకి భారత్లో ఇన్నోవేషన్ ల్యాబ్లతో కూడిన నాల్గో డెవలప్మెంట్ సెంటర్ కూడా హైదరాబాదే. తిరువనంతపురం, కొచ్చి, పుణెల తర్వాత ఇక్కడే కంపెనీకి మరో ఇన్నోవేషన్ ల్యాబ్ ఉన్నది. దేశవ్యాప్తంగా దాదాపు 15,000 మంది ఉద్యోగులున్నారు. ఇతర దేశాలన్నింటిలోనూ ఇంతే స్థాయిలో ఉద్యోగులుండగా, భారత్పై సంస్థకున్న ఆసక్తిని ఇది ప్రస్ఫుటం చేస్తున్నది. కాగా, 24 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఈ సంస్థ.. 30కిపైగా దేశాల్లో కార్యకలాపాలను సాగిస్తున్నది.
రిసెర్చ్ కోసం..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)ల్లో రిసెర్చ్, డెవలప్మెంట్ కోసం ఈ కొత్త సెంటర్ను వినియోగించనున్నట్టు యూ ఎస్టీ సీఈవో కృష్ణ సుధీంద్ర తెలిపారు. టెలికం, హైటెక్, రిటైల్, ఇన్సూరెన్స్ రంగాలపైనా పరిశోధనలు జరుగుతాయన్నారు.
హైదరాబాద్లో మా నూతన కార్యాలయం విస్తరణకు సహకరించిన
తెలంగాణ ప్రభుత్వానికి, క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థకు కృతజ్ఞతలు. ఈ కొత్త సెంటర్తో వ్యూహాత్మక రంగాలు, టెక్నాలజీల్లో స్థానిక యువతకు మెరుగైన అవకాశాలు రాగలవు. ప్రపంచ ఐటీ పరిశ్రమలో హైదరాబాద్ వృద్ధికి కట్టుబడి ఉన్నాం.
-అలెగ్జాండర్ వర్ఘీస్, యూఎస్టీ సీవోవో
రాష్ట్ర ప్రభుత్వ కృషితో..
నైపుణ్యం, ప్రతిభ కలిగి అంకితభావమున్న సాంకేతిక నిపుణులకు అడ్డాగా హైదరాబాద్, తెలంగాణ నిలుస్తున్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధే కారణమని ఆయా రంగాల ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. టెక్నాలజీ రంగంలోని పెద్దలతో తెలంగాణ ప్రభుత్వ నాయకత్వం నిరంతరం సత్సంబంధాలను కొనసాగిస్తుండటం కలిసొస్తున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే యూఎస్టీ తాజా విస్తరణ సైతం దీనికి ఓ నిదర్శనంగా పేర్కొంటున్నారు. ప్రధానంగా టీ-హబ్, వుయ్-హబ్లతోపాటు స్టార్టప్లను ప్రోత్సహించే వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం, వ్యాపార-పారిశ్రామిక రంగాలకు ప్రోత్సాహకాలివ్వడం, మౌలిక సదుపాయాలను కల్పించడం భేష్ అని కొనియాడుతున్నారు.