ముంబై, సెప్టెంబర్ 19: వరుసగా 11 రోజులపాటు జరిపిన మార్కెట్ ర్యాలీకి బ్రేక్పడింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనుండటంతో గ్లోబల్ ట్రెండ్స్ బలహీనత ప్రభావంతో సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 242 పాయింట్లు క్షీణించి 67,597 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ అల్టైమ్ రికార్డు స్థాయి నుంచి 59 పాయింట్లు నష్టపోయి 20,133 పాయింట్ల వద్ద నిలిచింది. క్రూడ్ ధరలు పెరగడం, డాలర్ ఇండెక్స్, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ బలపడటంతో మార్కెట్ క్షీణించిందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. మంగళవారం వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవు.
బ్యాంకింగ్, టెక్నాలజీ డౌన్
ఇటీవల జోరుగా పెరిగిన బ్యాంకింగ్, టెక్నాలజీ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరగడంతో ఆ రంగాల షేర్లు క్షీణించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.98 శాతం పడిపోయింది. ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ బ్యాంక్లు 1 శాతంపైగా తగ్గాయి. మరోవైపు పవర్గ్రిడ్, టైటాన్, మహీంద్రా, ఎన్టీపీసీలు లాభపడ్డాయి.