UPI Transactions | మొబైల్ యాప్స్ ఆధారిత యూపీఐ పేమెంట్స్లో మరో రికార్డు నమోదైంది. 2022 తొలి ఆరు నెలలతో పోలిస్తే 2023లో 62 శాతం పేమెంట్స్ పెరిగాయి. 2018 జనవరిలో 151 మిలియన్ లావాదేవీలు జరిగితే, గత జూన్ నెలలో 930 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇప్పటి వరకూ జరిగిన యూపీఐ లావాదేవీల్లో పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలే ఎక్కువ అని గ్లోబల్ పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్ ‘వరల్డ్ లైన్’ మంగళవారం తెలిపింది.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో 51.91 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగితే వాటిల్లో పర్సన్ టు మర్చంట్ లావాదేవీలు 29.15 బిలియన్లు.. సుమారుగా 56.1 శాతం పీ2ఎం పేమెంట్స్ జరిగాయి. 2022 జనవరి మొత్తం యూపీఐ పేమెంట్స్లో పీ2ఎం ట్రాన్సాక్షన్లు 40.3 శాతం ఉంటే.. ఈ ఏడాది జూన్ నాటికి 57.5 శాతానికి పెరిగాయని 2023 ‘తొలి అర్థ సంవత్సరంలో ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్’ అని వరల్డ్ లైన్ తెలిపింది.
‘తక్కువ ఫీజు ప్లస్ సెక్యూరిటీకి యూజర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. సకాలంలో చెల్లింపులు చేయడానికి సరైన మార్గం యూపీఐ పేమెంట్స్ అని నిర్ణయించుకోవడమే కారణం. రోజురోజుకు పీ2ఎం లావాదేవీలు శరవేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ధోరణి ప్రకారం 2025 నాటికి యూపీఐ లావాదేవీల్లో పీ2ఎం పేమెంట్స్ 75 శాతం ఉంటాయి’ అని నివేదిక వెల్లడించింది.
జూన్ నెలలో జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా 95.68 శాతం నమోదయ్యాయి. 2022 జూన్లో 94.55 శాతం మాత్రమే. ఇక ఆన్ లైన్ స్పేస్, ఈ-కామర్స్, గేమింగ్, యుటిలిటీ సేవలు, ప్రభుత్వ, ఆర్థిక సర్వీసుల కోసం 80 శాతానికి పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల విలువ 75 శాతానికి పై చిలుకే.
తెలంగాణతోపాటు మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గతేడాది అత్యధిక చెల్లింపులు జరిగాయి.