న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల విలువ గత నెల రూ.10వేల కోట్ల మేరకు పెరిగింది. ఆగస్టులో యూపీఐ ఆధారిత లావాదేవీలు రూ.10.73 లక్షల కోట్లుగా నమోదైనట్టు గురువారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. అంతకుముందు నెల జూలైలో రూ.10.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆగస్టులో మొత్తం 657 కోట్ల లావాదేవీలు జరగగా, జూలైలో 628 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదిలావుంటే గత నెల ఐఎంపీఎస్ ఆధారిత నగదు లావాదేవీల విలువ రూ.4.46 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఎన్పీసీఐ ఈ సందర్భంగా తెలియజేసింది. జూలైలో రూ.4.45 లక్షల కోట్లుగా ఉన్నాయి.