UPI for Credit Line Funds | ఇప్పుడు దేశమంతా డిజిటల్ పేమెంట్స్.. యూపీఐ చెల్లింపులే.. అంటే ఫోన్పే, జీ-పే, భారత్పే వంటి మొబైల్ యాప్ పేమెంట్సే.. వీటితో ప్రతి ఒక్కరు అవలీలగా ఆర్థిక లావాదేవీలు జరిపేస్తున్నారు. ఈ దిశగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ముందస్తుగా మంజూరు చేసిన ‘క్రెడిట్ లైన్’కూ యూపీఐ వినియోగాన్ని విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇటీవల ముగిసిన ద్వైవార్షిక ద్రవ్య పరపతి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
‘బ్యాంకుల్లోని సేవింగ్స్ ఖాతాల మధ్యే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ప్రస్తుతం సాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రీ-పెయిడ్ ఇన్స్ట్రుమెంట్ల ద్వారా కూడా యూపీఐ పేమెంట్స్ సాధ్యం అవుతున్నాయి. తాజాగా సేవింగ్స్ ఖాతాలతోపాటు క్రెడిట్ లైన్లోని నిధుల వినియోగానికి కూడా యూపీఐ పేమెంట్స్ విధానాన్ని విస్తరిస్తున్నాం. బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ లైన్ల ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్కు యూపీఐ నెట్వర్క్ వీలు కల్పిస్తుంది’ అని ఆర్బీఐ వెల్లడించింది. ఈ అంశమై త్వరలో పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ విడుదల చేస్తామని పేర్కొంది.
‘బ్యాంకుల నుంచి ముందస్తుగా మంజూరైన క్రెడిట్ లైన్లు యూపీఐ పేమెంట్స్ ద్వారా యాక్సెస్ చేయడానికి ఆర్బీఐ అనుమతి ఇవ్వడం వల్ల కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ డిపార్ట్మెంట్ చీఫ్ రాజశ్రీ రంజన్ వెల్లడించారు. దీనివల్ల ఖాతాదారులు తీసుకున్న రుణ విధానాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందన్నారు. సమర్థవంతమైన డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా కీలకమైన ముందడుగు అని అభిప్రాయ పడ్డారు.
మామూలుగా ఖాతాదారులు తీసుకున్న రుణం మొత్తం సంబంధిత బ్యాంకులు తమ రుణ గ్రహీతల ఖాతాల్లో డిపాజిట్ చేస్తాయి. వాటిని అవసరమైనప్పుడు రుణ గ్రహీతలు వాడుకుంటారు. కానీ, వారి ఖాతాలో రుణం డిపాజిట్ అయినప్పటి నుంచి వడ్డీ పడుతుంది. మన సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ము యూపీఐ ద్వారా పొందేందుకు వీలు కలుగుతుంది కూడా.
మంజూరైన రుణంలో వాడుకున్న మొత్తానికే వడ్డీ వర్తిస్తుంది. ఒకసారి శాంక్షన్ అయిన మొత్తం రుణం వాడుకుని పేమెంట్ చేస్తే.. అలా శాంక్షన్ అయిన మొత్తం మళ్లీ వాడుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ కాంబినేషన్ క్రెడిట్ లైన్. క్రెడిట్ లైన్ ద్వారా తీనుకునే లోన్లను యూపీఐ ద్వారా వాడుకునేందుకు పర్మిషన్ లేదు. కానీ, క్రెడిట్ లైన్ ద్వారా సంబంధిత రుణ గ్రహీత ఖాతాలో జమ అయ్యే మొత్తాన్ని యూపీఐ లావాదేవీల్లో వాడుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది.