UPI Server Down | కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. కానీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఇన్స్టంట్ పేమెంట్ సర్వీస్ సర్వర్ నిలిచిపోయింది. ఆదివారం గంట సేపు పని చేయలేదు. దీంతో డిజిటల్ వాలెట్, ఆన్లైన్ పేమెంట్స్ నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. యూపీఐని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది. తత్ఫలితంగా గూగుల్ పే, భారత్ పే, పేటీఎం, ఫోన్ పే, భీమ్ వంటి యాప్ చెల్లింపులకు ఇబ్బందులు కలిగాయి. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్కు దిగారు.
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఎన్పీసీఐ రంగంలోకి దిగింది. కేవలం గంట లోపే యూపీఐ సేవలను పునరుద్ధరించినట్లు తెలిపింది. సాంకేతిక లోపం వల్ల సేవలు నిలిచిపోయాయని ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా ఎన్పీసీఐ వెల్లడించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయని, యూపీఐ సిస్టమ్ను తాము సునిశితంగా పర్యవేక్షిస్తామని ఎన్పీసీఐ వెల్లడించింది. కొందరు తమకు ఎదురైన సమస్యలపై ఫిర్యాదు చేయగానే స్పందించామని తెలిపింది. మెయింటెనెన్స్ కార్యకలాపాల వల్లే యూపీఐ సిస్టమ్ పనిచేయడం లేదని ఐసీఐసీఐ పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయమై ఐసీఐసీఐ నోటిఫికేషన్ జారీ చేసిందని నెటిజన్ పేర్కొన్నారు.