New PF Rules | వివిధ కంపెనీల్లో, పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో ఖాతాలు ఉంటాయి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు జరుపాలంటే పాన్ కార్డు తప్పనిసరి. కానీ గతంలో పాన్ కార్డు లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేవారు. పాన్ కార్డు లేని వారు కూడా ఈపీఎఫ్వోలో సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. అటువంటి వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ వెసులుబాటు కల్పించారు.
పాన్ కార్డు లేకున్నా.. సంబంధిత ఉద్యోగి లేదా కార్మికుడు తన ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి నగదు విత్ డ్రాయల్స్పై టీడీఎస్ వసూలు శాతం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు 2023-24 బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ నిబంధన చేర్చారు. నాన్-పాన్ కార్డు హోల్డర్లు తమ ఈపీఎఫ్లో టాక్సబుల్ వాటా విత్ డ్రాయల్స్ మీద టీడీఎస్ను 30 నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈపీఎఫ్వో రికార్డుల్లో తమ పాన్ కార్డు డేటా అప్డేట్ చేసుకోని వేతన జీవులకు ఈ టీడీఎస్ తగ్గింపు వర్తిస్తుంది.
ఒకవేళ ఈపీఎఫ్వో రికార్డులో సంబంధిత ఉద్యోగులు, కార్మికులు తమ పాన్ కార్డ్ డేటా అప్డేట్ చేశారనుకోండి. వారు తమ ఈపీఎఫ్ నుంచి రూ.50 వేలకు పైగా విత్డ్రాయల్ చేస్తే 10 శాతం టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి నిధులు విత్డ్రా చేయాలనుకుంటున్నారా.. ఒకవేళ పాన్ కార్డుతో ఈపీఎఫ్ ఖాతా లింక్ చేయలేదా.. ఈపీఎఫ్ విత్ డ్రాయల్స్పై కొత్త నిబంధన అమల్లోకి వచ్చే వరకు వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.