ముంబై, నవంబర్ 24: ఒకవైపు వ్యక్తిగత రుణాలపై రిజర్వు బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆర్థిక సేవల సంస్థలు మాత్రం విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలు నాలుగు రెట్లు పెరిగి రూ.4.26 లక్షల కోట్ల నుంచి రూ.13.3 లక్షల కోట్లకు చేరుకున్నట్టు దేశీయ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్ వెల్లడించింది. ఇదే సమయంలో మొత్తం వ్యక్తిగత రుణాలు మూడింతలు పెరిగి రూ.51.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడేండ్లలో బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు తమ వ్యక్తిగత రుణాల మంజూరు ఒకటిన్నర రెట్లు పెరిగి ఈ మార్చి నాటికి రూ.170.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆదాయం, ఖర్చుల మధ్య అంతరం పెరిగిపోతుండటంతో అత్యవసర నిమిత్తం ప్రజలు వ్యక్తిగత రుణాలు తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు.