న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్ల వ్యవధిని కేంద్రం సడలించింది. ఉద్యోగులు, ఉన్నత చదువులు, క్రీడల కోసం విదేశాలకు వెళ్లే వారు 84 రోజులకు ముందే రెండో డోస్ వేసుకోవచ్చునని తెలిపింది.
అయితే, తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాతే రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం ఆయా వ్యక్తులు తాము విదేశాలకు వెళుతున్నట్లు నిర్ధారించే ధ్రువపత్రాలను అధికారులకు చూపాల్సి ఉంటుంది.
తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం విదేశాలకు వెళ్లే ఎంతో మంది భారతీయులకు లబ్ధి చేకూరుస్తుంది. కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని కేంద్రం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే.
అంతకుముందు కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య 6-8 వారాల గడువును కేంద్రం నిర్ణయించింది. దాన్ని ఇప్పుడు 12వారాలకు పెంచింది. డెల్టా వేరియంట్ వంటి కొత్త రకాలను దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్ రెండో డోసు గడువును 8వారాలకు తగ్గించాలని నిపుణులు పేర్కొన్నారు.