హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): బొగ్గు వెలికితీతకు బదులుగా భూగర్భంలోనే బొగ్గు నుంచి సిన్గ్యాస్ను ఉత్పత్తిచేసే ప్లాంట్లు త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లుగా పిలిచే వీటి ఏర్పాటుకు రా్రష్ట్రంలోని పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ శుక్రవారం ఇక్కడి ఓ హోటల్లో ఇండస్ట్రీ వర్గాలతో సమావేశమైంది. 53 సంస్థలు హాజరవగా, 40 కంపెనీలు ప్లాంట్లపట్ల ఆసక్తి చూపించాయి. ఈ సమావేశం అనంతరం కేంద్ర బొగ్గుశాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా మీడియాతో మాట్లాడారు. రూ.8,500 కోట్ల పెట్టుబడి రాయితీలు ఇస్తున్నామని, మరిన్ని వసతులూ కల్పిస్తామన్నారు. కేంద్ర బొగ్గుశాఖ అదనపు కార్యదర్శి రూపేందర్ బ్రార్, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బొగ్గు, లిగ్నైట్లను వెలికితీసి అధిక ఉష్ణోగ్రత వద్ద మండిస్తే పొగ, కాలుష్యం వెలువడుతుంది. ఇది వాతావరణానికి హానిచేస్తుంది. దీనికి బదులుగా భూగర్భంలోనే బొగ్గు, లిగ్నైట్ ఖనిజాలను రసాయన చర్యల ద్వారా మండించి మీథేన్ వంటి గ్యాస్లను ఉత్పత్తి చేస్తారు. బొగ్గుపై కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ గ్యాస్లను పంపించడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇదే సిన్గ్యాస్. దీన్నే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు.
సింగరేణి పనితీరు సంతృప్తికరంగా ఉందని, కొత్త గనులకు పూర్తిగా సహకరిస్తామని అమ్రిత్ లాల్ మీనా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సింగరేణి భవన్లో ఆయన సంస్థ సీఎండీ ఎన్ బలరామ్, డైరెక్టర్లతో సమీక్షించారు. సంస్థ పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలను బలరామ్ వివరించారు. సింగరేణి ప్రాంతంలోని మూడు బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కోరారు. దీంతోపాటు కొత్త గనులకు త్వరగా అనుమతులివ్వాలన్నారు. ఇక సంస్థ చేపట్టిన సోలార్, థర్మల్ ప్రాజెక్టుల పనితీరును అడిగి తెలుసుకోవడమే కాకుండా థర్మల్, సోలార్, జియో థర్మల్, ఓబీ నుంచి ఇసుక ఉత్పత్తి, కమర్షియల్ ఇసుక తయారీ తదితర ప్రాజెక్టుల పనితీరునూ మీనా కొనియాడారు.