Budget 2022 | వేతన జీవులపై పన్ను భారం తగ్గించాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో 65 శాతం మంది ప్రస్తుత ఆదాయం పన్ను వ్యవస్థ పట్ల అసంతృప్తితో ఉన్నారని ఓ తాజా సర్వే నిగ్గు తేల్చింది. యు-గవ్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో చాలా మంది ప్రస్తుత ఆదాయం పన్ను పరిమితులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పించనున్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థికాభివృద్ధికి ఆదాయం పన్ను చాలా ముఖ్యం అని 74 శాతం మంది పట్టణ ప్రజలు అంగీకరిస్తున్నారు.
అయితే, 38 శాతం మంది అంటే ప్రతి ఐదుగురిలో ఇద్దరు పట్టణ వాసులు మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపును పెంచాలని కోరుతున్నారు. వారిలో మెజారిటీ పేదలు, మధ్య తరగతి వారే ఉన్నారు. ఇక ప్రతి పది మందిలో ముగ్గురు (31 శాతం) ప్రస్తుత రూ.1.5 లక్షల పన్ను రాయితీ పరిమితి పెంచాలని అభ్యర్థిస్తున్నారు. ఇక అత్యధికంగా 32 శాతం మంది వేతనజీవులకు కల్పిస్తున్న రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని కోరిన వారిలో యువకుల కంటే 40 ఏండ్ల పై బడిన వారే.
కోవిడ్ మహమ్మారి ఉత్పాతం నేపథ్యంలో పెరిగిన మెడికల్ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని కోవిడ్ సంబంధ చికిత్స కోసం పన్ను డిడక్షన్ను ప్రత్యేక నిబంధన చేర్చాలని 35 శాతం మందికి పైగా కోరుతున్నారు. ఆదాయం పన్ను చట్టంలోని 80డీ సెక్షన్ పరిధిలో వైద్య ఖర్చుల కింద డిడక్షన్ పెంచాలని 30 మంది సూచించారు.
వేతన జీవుల్లో చాలా మంది ఇండ్ల రుణాలపై వడ్డీ మీద పన్ను రాయితీ పరిమితి పెంచుతారని ఆశిస్తున్నారు. 80 శాతం మంది నిరుపేదలు ఐదు శాతం పన్ను చెల్లింపు సబబేనంటున్నారు. 25 శాతం మంది మాత్రం 10 శాతం పన్ను చెల్లింపునకు రెడీ అంటున్నారు. రైతుల మాదిరిగా కొన్ని వృత్తుల వారికి ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ, ప్రతి పది మందిలో ఆరుగురు రైతులు ఏ పన్ను చెల్లించడం లేదని భావిస్తున్నారు. 35 శాతం మంది అందరిపైనా పన్ను విధించాలని సూచిస్తున్నారు.
వ్యాపారులు, సంపన్నుల్లో 51 శాతం మంది మిగతా పౌరుల కంటే ఎక్కువ పన్ను చెల్లిస్తున్నామని చెప్పారు. యూగవ్ ఓమ్నీ బస్ ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మంది, భారత్లో 1022 మంది అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక రూపొందించింది. సగం మంది పట్టణ వాసులు (47 శాతం) ప్రతియేటా బడ్జెట్ను అనుసరిస్తామని, ప్రతి 10 మందిలో ముగ్గురు (27 శాతం) కొన్నిసార్లు మాత్రమే అనుసరిస్తామని తెలిపారు.
67 శాతం మంది ప్రజలు తమ పర్సనల్ పైనాన్స్పై బడ్జెట్ ప్రభావం చూపుతుందని చెప్పారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల్లో చాలా మంది బడ్జెట్ ఫాలో అవుతామని, తమపై బడ్జెట్ ప్రభావం చూపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. పేదలు, సంపన్నులు మాత్రం తమ పర్సనల్ ఆదాయంపై అంతగా ప్రభావం చూపని బడ్జెట్ను ఫాలో కాబోమన్నారు.