న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు విలీనం కాబోతున్నాయి. ఈ ఏడాది చివరినాటి పూర్తికానున్న విలీనం తర్వాత ఏర్పడనున్న బ్యాంక్ దేశంలో రెండో అతిపెద్ద సంస్థగా అవతరించనున్నది. ప్రస్తుతం విలీనానికి సంబంధించి ఇరు బ్యాంక్ ఉన్నతాధికారులు సాధ్యాసాధ్యాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి 4 లేదా 5 పెద్ద బ్యాంకులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంట్లోభాగంగా చిన్న స్థాయి బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయనున్నట్టు ఓ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
విలీనం తర్వాత ఏర్పడే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ మెరుగుపడటంతోపాటు శాఖల నిర్వహణ, ఖాతాదారులు పెరుగనున్నారు. ఈ రెండు బ్యాంకుల విలీనం తర్వాత ఏర్పడే బ్యాంక్ ఆస్తులు రూ.25.4 లక్షల కోట్లకు చేరుకోనున్నది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత మూడో అతిపెద్ద బ్యాంక్గా అవతరించనున్నది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువల్లో రూ.2.13 లక్షల కోట్లతో ఆరో అతిపెద్ద పీఎస్యూ బ్యాంక్గా ఉండనున్నది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ను అధిగమించనున్నది. ప్రస్తుతం యూబీఐ, బీవోఐలు ఐదు, ఆరో ర్యాంక్లో ఉన్నాయి. 2017 నుంచి 2020 మధ్యకాలంలో పది బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంక్లుగా ఏర్పాటు చేసింది. దీంతో 27గా ఉన్న బ్యాంకులు ప్రస్తుతం 12కి తగ్గాయి.