న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.801 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.653 కోట్ల లాభంతో పోలిస్తే 22.66 శాతం వృద్ధిని కనబరిచింది. లాభాల్లో భారీ వృద్ధిని కనబరిచిన బ్యాంక్ ఆదాయం మాత్రం రూ.8,137 కోట్ల నుంచి రూ.7,365 కోట్లకు తగ్గినట్టు పేర్కొంది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.6,656 కోట్లుగా ఉన్నది.
మరోవైపు, ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా సమావేశమైన బ్యాంక్ బోర్డు రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ 44 పైసలు లేదా 4.40 శాతం డివిడెండ్ను ప్రకటించింది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.69 శాతం నుంచి 2.17 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 0.5 శాతం నుంచి 0.27 శాతానికి దిగొచ్చింది.
అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యూఐపీ, ఎఫ్పీవోతోపాటు ఇతర రూట్లలో రూ.2,700 కోట్ల నిధులను సేకరించడానికి బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మార్చి చివరినాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.5,90,314 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యాంక్ దేశవ్యాప్తంగా 3,412 శాఖలను నిర్వహిస్తున్నది.