Paytm | ఇప్పటికే ఆర్బీఐ ఆంక్షలతో సతమతం అవుతున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)’ మరింత కష్టాల్లో చిక్కుకున్నది. పేటీఎం ఆపరేషన్స్పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఈ నెల 29 తర్వాత ఆ సంస్థ తన కస్టమర్లు, మర్చంట్లు, ఇతర వాటాదారులను కొనసాగించగలదా? అన్న ఆందోళనపై ‘పేటీఎం’ బోర్డులో ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు.
పీపీబీఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) మాజీ ఎగ్జిక్యూటివ్ షింజిని కుమార్ గత డిసెంబర్లోనే రాజీనామా చేశారని పేటీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమె రాజీనామాను పేటీఎం బోర్డు ఆమోదించి, మరొకరిని నియమించిందని ఆ వర్గాల కథనం. 2016-17 మధ్య పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా ఆమె పనిచేశారు. ప్రస్తుతం ఉమెన్ ఫోకస్డ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ ‘సాల్ట్’ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.
ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మంజు అగర్వాల్ కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు (పీపీబీఎల్) ఇండిపెండెంట్ డైరెక్టర్గా రాజీనామా చేశారని వార్తలొచ్చాయి. పేమెంట్స్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకంటే ఎక్కువగా ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉండాలని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రత్యేక ఆహ్వానితురాలిగా పీపీబీఎల్ బోర్డు సమావేశాలకు షింజిని కుమార్ హాజరయ్యే వారని సమాచారం. దీనిపై స్పందించేందుకు పీపీబీఎల్ వర్గాలు అందుబాటులోకి రాలేదు.
ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేసినా పీపీబీఎల్లో మరో ముగ్గురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉన్నారు. వారిలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవింద్ కుమార్, అక్స్చేంజర్ ఎండీ పంకజ్ వైష్, పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మాజీ కార్యదర్శి రమేశ్ అభిషేక్ ఉన్నారు. పేటీఎం పేరెంట్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ వ్యవహారాల హెడ్ డాక్టర్ శ్రీనివాస్ యనమంద్ర, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ ప్రెసిడెంట్ భావేష్ గుప్తా, పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, సురీందర్ చావ్లా తదితరులు బోర్డు సభ్యులుగా ఉన్నారు.