TVS iQube | రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో అందరూ ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఈవీ కార్లకు గిరాకీ పెరుగుతున్నది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద యూజర్లు మోజు పెంచుకుంటుండటంతో వాటి తయారీ సంస్థలు సైతం పోటీ పడుతున్నాయి. అగ్రశ్రేణి టూ వీలర్స్ తయారీ సంస్థల్లో ఒక్కటైన టీవీఎస్ మోటార్స్ సైతం తన ఈవీ మార్కెట్ విస్తరణకు సంసిద్ధమైంది. వచ్చేనెలాఖరు నాటికి టీవీఎస్ ‘ఎక్స్’ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ప్రారంభిస్తామని తెలిపింది.
తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగం విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నదని సమాచారం. వచ్చే ఏడాది కాలంలో వివిధ ధరల శ్రేణుల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న టీవీఎస్ మోటార్స్కు చెందిన రెండు ఈవీ స్కూటర్లు మార్కెట్లో ఉన్నాయి. మున్ముందు మరి కొన్ని ఈవీ స్కూటర్లు మార్కెట్లోకి తేవాలని యోచిస్తున్నట్లు టీవీఎస్ మోటార్స్ తెలిపింది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఐక్యూబ్’కు మంచి డిమాండ్ ఉందని టీవీఎస్ మోటార్స్ సీఈఓ కేఎస్ రాధాకృష్ణన్ చెప్పారు. ప్రస్తుతం నెలకు 25 వేల ఐ-క్యూబ్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నారు. ఐ-క్యూబ్’కు గల గిరాకీ నేపథ్యంలో నెలవారీ ఉత్పత్తి సామర్థ్యం పెంచుతామన్నారు. ఏడాదిలోపు 5-25 కిలోవాట్ల మధ్య శ్రేణిలో స్కూటర్లు మార్కెట్లోకి తెస్తామన్నారు. దేశీయ ఈవీ టూ వీలర్స్ మార్కెట్లో టీవీఎస్ కీలక పాత్ర పోషించనున్నదని అన్నారు. వచ్చే తొమ్మిది నెలల్లో ‘ఐ-క్యూబ్’ను ఈయూ మార్కెట్లో ఆవిష్కరిస్తామన్న రాధాకృష్ణన్.. దశల వారీగా ఇతర దేశాల మార్కెట్లలోకి ప్రవేశిస్తామన్నారు.