RC Bhargava on India Growth | భారత్ ప్రగతి సాధించడానికి పరిమితులు ఉన్నా, ప్రైవేట్ రంగానికే అనుకూల పరిస్థితులు ఉన్నాయని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. అలాగని ప్రైవేట్ రంగమే పర్ఫెక్ట్ అని తాను చెప్పడం లేదని అన్నారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కార్ ప్రైవేట్ రంగంపైనే విశ్వాసం ఉంచిందన్నారు. ఉపాధి కల్పించడంలోనూ, పారిశ్రామిక ప్రగతి సాధించడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. భారత్లో మారుతి సుజుకి స్థాపించిన 40 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో ఆర్సీ భార్గవ శనివారం మీడియాతో మాట్లాడారు.
గత 60 నుంచి 65 ఏండ్లుగా ప్రభుత్వ రంగంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధార పడిందని ఆర్సీ భార్గవ చెప్పారు. ప్రభుత్వ రంగానికి రాజ్యాంగ పరిమితులు, చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిమితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగంపై నియంత్రణ, పర్యవేక్షణ అంతంత మాత్రమేనని చెప్పారు. ప్రభుత్వ రంగానికి సంబంధించి, వ్యక్తుల గురించి మాట్లాడట్లేదని, వ్యవస్థలోనే లోపం ఉందన్నారు.
ప్రభుత్వం నియమించే కమిటీల్లో చర్చలు తప్ప ఏమీ సాధించడం లేదని ఆర్సీ భార్గవ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను పరిశీలిస్తే ప్రైవేట్ సెక్టార్కే అనుకూలతలు ఎక్కువ అని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కార్ చురుగ్గా ప్రైవేటీకరణ ప్రక్రియ చురుగ్గా ముందుకు తీసుకు వెళుతుందన్నారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, జీఎస్టీ తగ్గింపు వంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకున్నదని చెప్పారు.