రూ.10 కోట్లతో ఇస్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన సంస్థ
హైదరాబాద్, మార్చి 15: హిండ్వేర్కు చెందిన ప్లాస్టిక్ పైపుల తయారీ సంస్థ ట్రూఫ్లో..తాజాగా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం హైదరాబాద్కు సమీపంలోని ఇస్నాపూర్ వద్ద ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో రాజేశ్ పజ్నో మాట్లాడుతూ..పది కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో 180 మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగా 600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ యూనిట్లో నెలకు 40-50 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంక్లు ఉత్పత్తి అవుతున్నాయని, వీటిని తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ వాటర్ ట్యాంక్లు రూ.3 వేలు మొదలుకొని రూ.15 వేల గరిష్ఠ ధరలో లభించనున్నాయి. భారత్లో వాటర్ ట్యాంక్ల మార్కెట్ రూ.3 వేల కోట్ల స్థాయిలో ఉన్నదని, ప్రతియేటా 11 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.431 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇస్నాపూర్లో ఏర్పాటు చేసిన ప్లాంట్లో 500 లీటర్ల నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్లు తయారవుతున్నాయి.