`Hero` Brand Fight | హీరో మోటో కార్ప్ అధినేత పవన్ ముంజాల్కు బిగ్ రిలీఫ్ లభించింది. పవన్ ముంజాల్ సారధ్యంలోని హీరో మోటో కార్ప్.. ఎలక్ట్రిక్ టూ వీలర్స్కు హీరో బ్రాండ్ వాడుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ గురువారం తీర్పు చెప్పింది. `హీరో` బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటర్లు తయారు చేసి విక్రయించవచ్చునని తెలిపింది. ముంజాల్ ఫ్యామిలీ గ్రూప్ సంస్థలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు ట్రిబ్యునల్ను ఆదేశించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్కు హీరో బ్రాండ్ వాడకుండా తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హీరో ఎలక్ట్రిక్ దాఖలు చేసిన పిటిషన్ను మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ కొట్టి పారేసింది. హీరో ఎలక్ట్రిక్ దాఖలు చేసిన పిటిషన్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, రిటైర్డ్ న్యాయమూర్తులు ఇందు మల్హోత్రా, ఇందర్మీత్ కౌర్లతో కూడిన ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీనిపై హీరో మోటో కార్ప్స్, హీరో ఎలక్ట్రిక్ స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు.
2012 నుంచి ఎలక్ట్రిక్ వాహనాల కోసం కసరత్తు చేస్తున్నామని హీరో మోటో కార్ప్ ప్రకటించింది. కానీ నవీన్ ముంజాల్ సారధ్యంలోని హీరో ఎలక్ట్రిక్ కోర్టుకెక్కడంతో పవన్ ముంజాల్.. `విదా పవర్డ్ బై హీరో` బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి రావాలని నిర్ణయించారు. కానీ, కొత్త బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ ఆవిష్కరణను హీరో మోటో కార్ప్ వాయిదా వేసింది.
ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం హీరో మోటో కార్ప్స్ సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేసిందని, విపణిలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. గత పదేండ్లుగా హీరో బ్రాండ్పై రూ.7,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, దీనివల్ల హీరో బ్రాండ్ గుర్తింపు, పలుకుబడి పెరిగిందని వెల్లడించింది. కానీ నవీన్ ముంజాల్ సారధ్యంలోని హీరో ఎలక్ట్రిక్ కేవలం రూ.65 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అభిప్రాయ పడింది.