Toyota Rumion | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన ఎంపీవీ కారు రుమియాన్ (Rumion) స్పెషల్ ఎడిషన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రూ.20,608 విలువ గల కాంప్లిమెంటరీ టయోటా జెన్యూన్ యాక్సెసరీ (టీజీఏ)తోపాటు రుమియాన్ ఫెస్టివ్ ఎడిషన్ కారు లభిస్తుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ ప్యాకేజీ మాత్రమేనని టయోటా పేర్కొంది. ఇప్పటికే హై రైడర్, గ్లాన్జా, టైసర్ కార్లలో ఫెస్టివ్ ఎడిషన్ కార్లు ఆవిష్కరించింది.
టయోటా రుమియాన్ ఫెస్టివ్ ఎడిషన్ కార్లు ఈ నెలాఖరు వరకూ లభ్యం అవుతాయి. అదనపు ధర చెల్లించనవసరం లేకుండా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంపీవీ రుమియాన్ కారును కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఈ కారు ధర రూ.10.44 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.13.73 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. మారుతి సుజుకి ఎర్టిగా, కియా కరెన్స్ వంటి కార్లతో టయోటా రుమియాన్ పోటీ పడుతుంది. దేశవ్యాప్తంగా టయోటా డీలర్ల వద్ద టయోటా రుమియాన్ ఎంపీవీ ఫెస్టివ్ ఎడిషన్ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
టయోటా రుమియాన్ కారు గార్నిష్డ్ హెడ్ ల్యాంప్స్, రేర్ బంపర్, టెయిల్ గేట్, నంబర్ ప్లేట్, క్రోమ్ డోర్ విజర్స్, రూఫ్ ఎడ్జ్ స్పాయిలర్, మడ్ ఫ్లప్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. వీటితోపాటు ఇంటీరియర్ గా డీలక్స్ కార్పేట్ మ్యాట్స్ ఏర్పాటుతో మరింత ప్రీమియం లుక్ ఉంటుంది. అన్ని వేరియంట్లలోనూ లిమిటెడ్ ఎడిషన్ గా రుమియాన్ ఫెస్టివ్ కారు లభిస్తుంది. పెట్రోల్, సీఎన్జీ మోడల్స్లోనూ అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్తోపాటు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో కొనుక్కోవచ్చు. లీటర్ పెట్రోల్ మీద 20.51 కి.మీ, కిలో సీఎన్జీ గ్యాస్ మీద 26.11 కి.మీ మైలేజీ లభిస్తుంది.