Toys Park | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్లో ఏర్పాటు చేస్తున్న బొమ్మల తయారీ పార్క్ ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే దేశ, విదేశాల్లోని 16 ప్రఖ్యాత కంపెనీలకు ఇందులో స్థలాలను కేటాయించారు. మరిన్ని సంస్థలకూ ప్లాట్లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయిన వెంటనే పార్క్ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం దండు మల్కాపూర్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలోనే ఈ బొమ్మల తయారీ పార్క్ కోసం 106 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. అందులో రహదారులు, బహిరంగ స్థలంపోగా మిగిలిన స్థలంలో 196 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు 32 ఎకరాల్లో ప్లాట్లను 16 కంపెనీలకు కేటాయించారు. ఈ పార్క్తో సుమారు రూ.200 కోట్ల పెట్టుబడులు, దాదాపు 25,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా.
ముందుచూపుతో..
దేశీయ మార్కెట్లో లభిస్తున్న వివిధ రకాల బొమ్మల్లో అత్యధికం చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఈ నేపథ్యంలో ముందుచూపుతో తెలంగాణను బొమ్మల తయారీకి కేంద్రంగా తీర్చిదిద్దాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎక్కడా లేనివిధంగా 106 ఎకరాల్లో టాయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్కు అంకురార్పణ చేసింది. ప్రస్తుతం బొమ్మల తయారీ రంగం ఎంతో విస్తరించింది. గతంలో మాదిరి కేవలం చెక్క బొమ్మలకు పరిమితం కాకుండా ప్లాస్టిక్ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, స్టెమ్ టాయ్స్, రోబోటిక్ అండ్ ఎలక్ట్రానిక్ టాయ్స్, నాన్-టాక్సిక్ టాయ్స్, ఉడెన్ అండ్ ట్రెడిషనల్ టాయ్స్, మాంటెస్సోరీ అండ్ ఎడ్యుకేషనల్ టాయ్స్ తదితర అనేక రకాల బొమ్మలు తయారవుతున్నాయి. పిల్లలకు విద్యను, విజ్ఞానాన్ని అందించేందుకు కూడా బొమ్మలను వినియోగిస్తున్నారు. దీంతో బొమ్మల తయారీకి విస్తృత అవకాశాలున్నాయని, దేశంలో మంచి మార్కెట్ కూడా ఉందని అధికారులు చెప్తున్నారు.