Maruti Suzuki | న్యూఢిల్లీ, జూన్ 10: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ దూసుకుపోతున్నది. గత నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన టాప్-10 వాహనాల్లో కంపెనీకి చెందిన ఏడు మాడళ్లకు చోటు లభించింది. ఈ జాబితాలో మారుతికి చెందిన స్విఫ్ట్ తిరిగి తొలి స్థానంలో నిలిచింది. 19,393 యూనిట్లతో స్విఫ్ట్ తొలిస్థానం దక్కించుకున్నది. ఇటీవల మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన సరికొత్త స్విఫ్ట్లో పలు మార్పులు చేయడంతో కొనుగోలుదారులు మక్కువచూపిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన ప్యాసింజర్ వాహన విక్రయాలకు బ్రేక్ పడింది. వేసవి కాలం కావడంతో సార్వత్రిక ఎన్నికలు జరగడంతో వాహనాలకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. దీంతో గత నెలలో పీవీల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన ఒక్క శాతం తగ్గాయని గత నెలకుగాను దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. మొత్తంగా 3,03,358 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఏడాది క్రితం ఇదే నెలలో అయిన 3,35,123 యూనిట్లతో పోలిస్తే భారీగా తగ్గాయి.