Kia KY MPV | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ కొత్త మోడల్ కారును దేశీయ విపణిలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. వచ్చేనెల 16న కేవై అనే కోడ్నేమ్తో ఈ మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ) కారును ఆవిష్కరించనున్నది. అంతర్జాతీయ విపణిలో జనవరి-మార్చి త్రైమాసికంలో ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ వర్గాల కథనం. ఇప్పుడు భారత్లో సెల్టోస్, సోనెట్, కార్నివాల్ అనే మూడు మోడల్ కార్లను విక్రయిస్తున్నది. దేశీయ విపణిలోకి వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కియా.. కేవై మోడల్ కారు రానున్నట్లు తెలుస్తున్నది.
ఫ్యామిలీ కారుకు భారత్లో పెరుగుతున్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త మోడల్ కారును డిజైన్ చేశామని కియా మోటార్స్ ఇండియా ఎండీ కం సీఈవో తే-జిన్ పార్క్ చెప్పారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న 6-7 సీటర్ల మోడల్కు భిన్నంగా కొత్త సెగ్మెంట్లో వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ సమయంలో కియా కార్లకు భారత్కు విశేషమైన ఆదరణ లభించింది. రెండేండ్ల గడువులో గత జూలైలోనే మూడు లక్షల కార్లను విక్రయించిన కంపెనీగా రికార్డు నెలకొల్పింది.