న్యూఢిల్లీ, నవంబర్ 30: ఒకవైపు కార్పొరేట్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తుండగా..మరోవైపు ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ మాత్రం వచ్చే ఏడాది వెయ్యి మంది ఇంజినీరింగ్ విద్యార్థులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లలో ప్రతిభ అధికంగా ఉన్న 1,000 మంది ఇంజినీర్లను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, నోయిడా, ఢిల్లీలలో ఉన్న ఆర్అండ్డీ సెంటర్లను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నియామకానికి తెరలేపింది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ బీహెచ్యూల నుంచి 200 మంది ఐఐటీ విద్యార్థులను నియమించుకోనున్నది. 5జీ, ఏఐ, ఎంఎల్, ఐవోటీ, కెమెరా, విజన్ టెక్నాలజీ విభాగాల్లో వినూత్న పరిశోధనలు జరిపేందుకు సంస్థ తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నదని, దీంట్లోభాగంగానే భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.