SBI | ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాలను మెచ్యూర్ కాకముందే బ్రేక్ చేసినందుకు, ముందస్తుగా విత్ డ్రా చేసినందుకు ఇన్వెస్టర్లు పెనాల్టీ చెల్లించాల్సిందే. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం మెచ్యూరిటీ తేదీ రాకముందే ఇన్వెస్టర్లు నగదు విత్డ్రా చేసినా పెనాల్టీ విధించడం లేదు. అటువంటి బ్యాంకుల జాబితాలోకి ఎస్బీఐ వస్తుంది.
ఎస్బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (ఎస్బీఐ ఎంవోడీఎస్) అనేది టర్మ్ డిపాజిట్ స్కీమ్. దీన్ని సేవింగ్స్ ఖాతాతో గానీ, కరంట్ ఖాతాతో గానీ లింక్ చేస్తారు. కానీ సాధారణ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెనాల్టీ చెల్లించకుండానే మనీ విత్ డ్రా చేసుకోవచ్చు.
భారతీయులు ఒంటరిగా, సంయుక్తంగా, మైనర్లు (గార్డియన్ల ద్వారా), హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్), ఒక సంస్థ, కంపెనీ, స్థానిక సంస్థలు, ప్రభుత్వశాఖ లేదా విభాగం.. ఎస్బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్లో చేరొచ్చు. ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే ఇతర రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే వడ్డీరేటు అమలవుతుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ చెల్లిస్తుంది ఎస్బీఐ.
ఏడు రోజుల నుంచి 45 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.40 శాతం, 179 రోజుల వరకు 4.40 శాతం, 210 రోజుల వరకు 5.05 శాతం, ఏడాది లోపు 5.10, రెండేండ్లలోపు 5.95, మూడేండ్లలోపు 6.00, ఐదేండ్లలోపు 6.10, పదేండ్లలోపు గడువు 6.45 శాతం వడ్డీ చెల్లించనున్నది.
ఎస్బీఐ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ ఏడాది నుంచి ఐదేండ్ల లోపు అమలవుతుంది. డిపాజిట్లు పూర్తిగా లిక్విడ్గా ఉంటాయి. రూ.1000 నుంచి ఎంత వరకైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం, చెక్, బ్యాంక్ శాఖ ద్వారా మనీ విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ స్కీమ్లో చేరిన ఖాతాదారులు తమ సేవింగ్స్ లేదా కరంట్ ఖాతాలో సగటున నగదు నెలవారీ బ్యాలెన్స్ కొనసాగించాల్సి ఉంటుంది. ఈ పథకంలో నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే టీడీఎస్ కోత విధిస్తారు.