న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ధరల కట్టడిని ఆర్బీఐ కాకుండా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, మోదీ దౌత్యంతో ముడిచమురును రష్యా నుంచి చౌకగా కొనుగోలు చేస్తూ ధరల్ని అదుపు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్పలుచెప్పిన రెండ్రోజులకే ద్రవ్యోల్బణం గణాంకాలు షాకిచ్చాయి. వరుసగా మూడు నెలలు నెమ్మదించిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో ఒక్కసారిగా భగ్గుమంది.
అధిక ఆహారోత్పత్తుల ధరలతో ఇది 7 శాతానికి పెరిగింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశించిన 6 శాతం ఎగువనే ద్రవ్యోల్బణం రేటు కొనసాగడం ఇది వరుసగా ఎనిమిదో నెల. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో 6.71 శాతంకాగా, 2021 ఆగస్టులో ఇది 5.3 శాతం. రిజర్వ్బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపును ప్రభావితం చేసేది రిటైల్ ద్రవ్యోల్బణమే. జాతీయ గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన డాటా ప్రకారం ఆగస్టు నెలలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం భారీగా 7.62 శాతం పెరిగింది. 2022 జూలైలో ఈ వృద్ధి రేటు 6.69 శాతంకాగా, నిరుడు ఆగస్టులో 3.11 శాతం.కూరగాయలు, మసాలా దినుసుల ధరల్లో వృద్ధి 10 శాతాన్ని మించింది. తృణ ధాన్యాలు, పప్పు దినుసుల ధరలు కూడా పెరిగాయి.