Ujjivan SFB | ధరలను కట్టడి చేయడానికి ఆర్బీఐ రెపోరేట్ పెంచేయడంతో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో డబ్బు మదుపు చేసే వారికి మంచి రోజులు వచ్చాయి. దాదాపు ప్రతి బ్యాంకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచేసింది. ఆ బాటలో బుల్లి బ్యాంక్.. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక అడుగు ముందే ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా మూడు టెన్యూర్లతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై మిగతా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీరేటు అందిస్తున్నది. 75 వారాలు, 75 నెలలు, 990 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఇక సీనియర్ సిటిజన్లకు అదనంగా 75 బేసిక్ పాయింట్ల వడ్డీ అందిస్తున్నది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెలవారీ, త్రైమాసికం వారీగా, మెచ్యూరిటీ టైం వారీగా వడ్డీ చెల్లింపుల ఆప్షన్ కల్పిస్తున్నది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం మీద పన్ను కూడా ఆదా అవుతుంది. అయితే, ఐదేండ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో (డొమెస్టిక్ అండ్ ఎన్నారై) రూ.2 కోట్ల లోపుఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీరేట్లు
టెన్యూర్ ———– ఇంతకుముందు —– సవరించిన
వడ్డీరేటు ————- వడ్డీరేటు (2022, ఆగస్టు 9 నుంచి)
75 వారాలు ——– 7.00 శాతం ————- 7.50
(225 రోజులు)
990 రోజులు ——– 7.20 శాతం ————- 7.50
75 నెలలు ———- 6.00 శాతం ————- 7.50
775 వారాల గడువుతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కింద రూ.లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ డేట్ నాటికి రూ.1,11,282 లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీ పరకారం రూ.1,12,466 సొమ్ము లభిస్తుంది.
దీంతోపాటు 990 రోజుల గడువు గల ప్లాటినా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడాదికి 7.7 శాతం వడ్డీ లభిస్తుంది. రెగ్యులర్ డిపాజిట్ స్కీమ్ కంటే 20 బేసిక్ పాయింట్ల వడ్డీ అదనంగా లభిస్తుంది. ఈ పథకం కింద కస్టమర్లు రూ.15 లక్షల నుంచి రూ.2 కోట్ల లోపు నగదు డిపాజిట్ చేయొచ్చు. ఇక ప్లాటినా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం నాన్-కాలబుల్ ఫిక్స్డ్ డిపాజిట్. అంటే ప్లాటినా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద మదుపు చేసిన సొమ్ము పాక్షికంగా గానీ, ముందస్తుగా గానీ విత్డ్రాయల్ చేయడానికి నిబంధనలు అనుమతించవు.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కరోల్ ఫుర్టాడో మాట్లాడుతూ `భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మా కస్టమర్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచాలని నిర్ణయించాం` అని తెలిపారు.