Hyderabad in Cost of Living | దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్లోనే ఖర్చు తక్కువ అని తెలుస్తున్నది. కుటుంబ జీవన వ్యయంతోపాటు ఇంటికయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే పుణె, కోల్కతా తర్వాతీ స్థానంలో భాగ్యనగరం నిలిచింది. ఇండ్ల ధరలు హైదరాబాద్లోనే తక్కువ అని మెసర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే నివేదిక తెలిపింది. ముంబైతోపాటు దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఇండ్ల ధరలు, ఇండ్ల అద్దెలు అత్యంత ఎక్కువ. ఈ మూడు నగరాల్లో జీవన వ్యయం కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని ఈ సర్వే వెల్లడించింది.
దేశంలోని వివిధ ప్రాంతాల, వివిధ దేశాల నుంచి ఉద్యోగార్థం భారత్కు వచ్చే ఉద్యోగులు, ప్రభుత్వాల అధికారులు, సంస్థల సిబ్బంది జీవన వ్యయం ఆధారంగా ఈ సర్వే సాగింది. గత మార్చిలో నిర్వహించిన సర్వేలో 200కి పైగా వస్తువులు, నిత్యావసరాల ధరలు, ఇండ్లు, రవాణా, ఫుడ్, దుస్తులు, ఎంటర్టైన్మెంట్ ఖర్చు ఆధారంగా ర్యాంక్లు ఇచ్చింది మెస్సర్స్. ఐదు ఖండాల పరిధిలోని వివిధ దేశాల్లోని 227 నగరాలు, పట్టణాలను పరిగణనలోకి తీసుకున్నది.
గ్లోబల్ కార్పొరేట్ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం అత్యంత అనుకూలంగా ఉన్నా.. తక్కువ ఖర్చయ్యే హైదరాబాద్, చైన్నై, పుణె నగరాల పట్ల ఆయా కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ముంబైలో అధిక ఖర్చుల నేపథ్యంలో పుణె, చెన్నై, హైదరాబాద్ ఆకర్షణీయ మెట్రో నగరాలని మెసర్స్ 2022 సర్వే నివేదిక వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జీవన వ్యయం తక్కువ.
ఢిల్లీ, ముంబై నగరాల్లో పాలు బ్రెడ్, కూరగాయలు, పండ్ల కొనుగోలుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే, చెన్నై, హైదరాబాద్లో తక్కువ ఖర్చుతో సరిపెట్టుకోవచ్చు. అంతర్జాతీయంగా ముంబై, వ్యయాల పట్ల ఢిల్లీ ఆకర్షణీయంగా ఉందని సారాంశం. మెస్సర్స్ లివింగ్ కాస్ట్ 2022 నివేదిక ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో ముంబై 127వ ర్యాంక్, ఢిల్లీ 155, చెన్నై 177, హైదరాబాద్ 192, పుణె 201, కోల్కతా 203వ ర్యాంక్లో ఉన్నాయి.
ప్రపంచంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హాంకాంగ్ అత్యంత ఖర్చుతో కూడిన నగరంగా ఉంది. తర్వాతీ స్థానాల్లో జ్యురిచ్, జెనీవా, స్విట్జర్లాండ్లోని బాసెల్, బెర్న్, ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్, జపాన్ రాజధాని టోక్యో, చైనా క్యాపిటల్ బీజింగ్ ఉన్నాయి. విదేశీ ఉద్యోగులు జీవనం సాగించడానికి అత్యంత చౌక నగరాలుగా టర్కీలోని అంకారా (227 ర్యాంక్), కిర్గిస్థాన్లోని బిష్కెక్ (226), తజికిస్థాన్లోని దుషాంబే (225) నిలిచాయి.
కరోనా మహమ్మారి ప్రభావంతో తలెత్తిన గ్లోబల్ హెల్త్ సంక్షోభం, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోయిన నిత్యావసర ధరలు, కరెన్సీలో అనిశ్చితి తదితర కారణాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమతుల్యతపై ప్రభావం చూపుతున్నాయి. తద్వారా ప్రజల జీవన వ్యయం పెరుగుతున్నదని సర్వే అభిప్రాయ పడింది.