SUVs- Cars | పర్యావరణం దెబ్బ తినకుండా కర్బన ఉద్గారాలను మరింత నియంత్రించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అందుకోసం వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (ఆర్డీఈ) నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో దేశీయ మార్కెట్ నుంచి పలు కార్లు, ఎస్యూవీలు కనుమరుగు కానున్నాయి. స్పీడ్, యాక్సిలరేషన్, డిసిలరేషన్లో తరుచుగా మార్పులు రావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకసారి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కార్ల తయారీ దారులు తమ కార్ల నుంచి ఉద్గారాలను తగ్గించడానికి వాటి ఇంజిన్లను అప్గ్రేడ్ చేయాలి. ప్రత్యేకించి డీజిల్ వినియోగ ఇంజిన్ల అప్గ్రెడేషన్ ఖర్చుతో కూడుకున్నది. దీంతో 27 కార్లు, ఎస్యూవీలు దేశీయ మార్కెట్ నుంచి కనుమరుగు కానున్నాయి.
ఆర్డీఈ నిబంధనల ప్రకారం.. కార్లలో ఆన్బోర్డ్ సెల్ఫ్-డయాగ్నోస్టిక్ డివైజ్ ఉండాల్సిందే. ఇది రియల్ టైం డ్రైవింగ్ ఎమిషన్ లెవెల్స్ను నిర్ధారిస్తుంది. ఆన్బోర్డు సెల్ఫ్ డయాగ్నొస్టిక్ డివైజ్ అనునిత్యం క్యాటలిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సర్లు ఉద్గారాల నియంత్రణ ప్రమాణాలను అందుకుంటుందా? అని పర్యవేక్షిస్తుంది. క్రాంక్షాఫ్ట్ పొజిషన్స్, థ్రోట్టిల్, ఇంజిన్ టెంపరేచర్ తదితర అంశాలను నిర్ధారించడానికి కార్ల తయారీ దారులు సెమీ కండక్టర్లను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇంధనం మండిపోకుండా నియంత్రించడానికి కార్లు, ఎస్యూవీల్లో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను ఏర్పాటు చేయాలి.
ఉద్గారాల నియంత్రణకు ఉపయోగించే `సెలెక్టివ్ క్యాటలిక్ రిడక్షన్ (ఎస్సీఆర్)` అత్యంత ఖర్చుతో కూడిన పని. దీనివల్ల డీజిల్ ఇంజిన్ కార్ల తయారీ ఖర్చు పెరుగుతుంది. కార్ల ధరతో పోలిస్తే చిన్న ఇంజిన్ల అప్గ్రెడేషన్ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కంపాక్ట్ డీజిల్ కార్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలుస్తున్నది. గత కొన్నేండ్లుగా డీజిల్ వేరియంట్ హ్యాచ్బ్యాక్, సెడాన్ కార్లకు డిమాండ్ తగ్గుతూ వస్తున్నది.పెట్రోల్ వినియోగ కార్లలోనూ ఇంజిన్ల అప్గ్రెడేషన్ ఖర్చుతో కూడుకున్నదే. తత్ఫలితంగా వాటి ధరలు పెరుగుతాయి. అదే జరిగితే కొన్ని మోడల్ కార్లను ఆయా కార్ల తయారీ దారులు వదిలించుకోక తప్పదు.