న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తాము ప్రస్తుతం తెస్తున్న 5జీ సర్వీసులపై ప్రీమియం చార్జీలను వసూలు చేసే యోచన లేదని భారతీ ఎయిర్టెల్ స్పష్టం చేసింది. ప్రీమియం ధరలతో 5జీ సేవల్ని అందించడానికి పలు దేశాలు టెలికం కంపెనీలు చేసిన ప్రయత్నం సఫలం కాలేదని ఎయిర్టెల్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ వినియోగదారులు 2జీ నుంచి 4జీకి, ప్రి-పెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్కు మారడం, పోస్ట్పెయిడ్ కస్టమర్లు బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ తదితర ఎయిర్టెల్ సర్వీసులు తీసుకోవడం ద్వారా కంపెనీకి ఎంతో వ్యాపారం సమకూరుతుందని చెప్పారు.
2జీ ఖాతాదారులు 4జీకి మారితే ఏపీఆర్యూ (ఒక యూజర్ ద్వారా వచ్చే సగటు ఆదాయం) రెట్టింపవుతుందని, ప్రి-పెయిడ్ నుంచి పోస్ట్పెయిడ్కు వస్తే ఏపీఆర్యూ మరోదఫా రెట్టింపు అవుతుందని, అదే పోస్ట్పెయిడ్ ఖాతాదారు అన్ని హోంసర్వీసుల్ని తీసుకుంటే ఏపీఆర్యూ మూడింతలు పెరుగుతుందని ఆ అధికారి వివరించారు. 2022 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్టెల్ రూ.190 ఏపీఆర్యూను సాధించింది. 5జీ రోల్అవుట్ కారణంగా తమ టెలికం నెట్వర్క్పై రూ.27,000-28,000 కోట్ల మేర మూలధన పెట్టుబడులు చేయాలన్నది కంపెనీ ప్రణాళిక.
6 వారాల్లో రూ.155 ప్లాన్
రానున్న రోజుల్లో మొబైల్ ప్లాన్స్ ధరలు పెరిగే అవకాశం ఉందని, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా పెంపు పరిమాణం ఉంటుందన్నారు. భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే హర్యా నా, ఒడిశా రాష్ర్టాల్లో 28 రోజుల కాలపరిమితిగల కనిష్ట రీచార్జ్ ప్లాన్ ధరను రూ.99 నుంచి రూ.155కు పెంచివేసింది. ఈ కొత్త టారీఫ్పై రెండు రాష్ర్టాల్లో సానుకూల స్పందన వ్యక్తమయ్యిందని, ఇతర టెలికం ఆపరేటర్లకు మళ్లేవారి సంఖ్య తమ అంచనాలకంటే తక్కువగా ఉందని ఎయిర్టెల్ అధికారి వివరించారు. ఈ కొత్త కనిష్ట ప్లాన్పై వచ్చే ఆరువారాల్లో కంపెనీకి ఒక అవగాహన వస్తుందని, తదుపరి దీనిని ఇతర టెలికం సర్కిళ్లలో ప్రవేశపెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.