Narayana Murthi on ChatGPT | కృత్రిమ మేధ ఆధారంగా రూపుదిద్దుకున్న చాట్జీపీటీ (ChatGPT)పై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుష్యుల శక్తి, సామర్థ్యాలను చాట్జీపీటీ వంటి ఏఐ ఆధారిత చాట్బోట్లు భర్తీ చేయలేవని తేల్చి చెప్పారు. మానవుడి మేధస్సును ఢీకొట్టలేదని స్పష్టం చేశారు.`సమాచార సేకరణ, విషయ సముపార్జనకు చాట్జీపీటీ గొప్ప టూల్. అయితే, కొన్ని అంశాల్లో మనుష్యులతో అది పోటీ పడలేదు. మనిషి మెదడుని మించిన యంత్రం మరొకటి లేదని నమ్మే వారిలో నేనూ ఒకడ్ని. కనుక చాట్జీపీటీ తరహా ఏఐ చాట్బోట్లు ఏనాటికీ మనుష్యులను భర్తీ చేయలేవు` అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాట్జీపీటీ తరహా చాట్బోట్లు ఉద్యోగాలను భర్తీ చేస్తాయని, కొలువులకు ముప్పు వస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో నారాయణమూర్తి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఉత్పాదకత పెంపుదలకు చాట్జీపీటీ తరహా చాట్బోట్లు మనుష్యులకు సాధనాలుగా మాత్రమే ఉపయోగ పడతాయని నారాయణమూర్తి చెప్పారు. చాట్జీపీటీని ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రశ్న అడితే.. సమాధానం ఒకటే వస్తుందన్నారు. కానీ, ఆ ఇద్దరిలో ఒకరు తమ సృజనాత్మకతను జత చేసి మెరుగైన ఫలితం పొందినట్లు చూపవచ్చునన్నారు. చాట్జీపీటీ తరహా చాట్బోట్ల పట్ల ఎక్కువ ఆందోళనే అక్కర్లేదన్నారు. మనిషి సృజనాత్మకత, అత్యాధునిక టెక్నాలజీ కలిసి పలు రకాల సమస్కలు పరిష్కరించవచ్చునని స్పష్టం చేశారు.
ఇంతకుముందు ఓ సదస్సులో నారాయణమూర్తి మాట్లాడుతూ ఇదే అభిప్రాయం వెల్లడించారు. కృత్రిమ మేధ వల్ల ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందన్న వాదనతో విభేదించారు. ఏఐ, దాని ఆధారిత చాట్బోట్లతో భవిష్యత్లో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లవచ్చునని, కనుక అత్యాధునిక చాట్జీపీటీ వ్యవస్థల అభివృద్ధిని నిలిపేయాలని ఇటీవల ఎలన్మస్క్ సహా పలువురు ఐటీ నిపుణులు ఓ బహిరంగ లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే.