Finance Ministry | న్యూఢిల్లీ, మే 22: ‘దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ అనిశ్చిత పరిస్థితులతో వృద్ధిరేటు పడిపోవచ్చు. ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలూ ఉన్నాయి’ అంటూ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో పేర్కొన్నది. దేశంలో వినియోగ సామర్థ్యం బాగానే కనిపిస్తున్నదని, వృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని, నిర్మాణ ఇతర రంగాల్లో పెట్టుబడులకు ఢోకా లేదని చెప్తూనే పైవిధంగా ఆందోళన వెలిబుచ్చడం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
ఏప్రిల్కుగాను నెలసరి ఆర్థిక సమీక్షను ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. విదేశీ పరిణామాలు, వాతావరణ మార్పులపైనే ఈసారి దేశ జీడీపీ వృద్ధిరేటు ఆధారపడి ఉండొచ్చన్న అభిప్రాయాలను వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని, జీడీపీ వృద్ధిరేటును గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ నివేదికలో వ్యాఖ్యానించింది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లోనే మొదలైనందున మొత్తం ఏడాది ఎలా? ఉంటుందనే దానిపై అప్పుడే స్పష్టత రాదన్నది.