ముంబై, జూలై 11: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతూనే ఉన్నది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో మరో 19 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేనివిధంగా 79.45 వద్దకు దిగజారింది. ఇంటర్బ్యాంకింగ్లో 79.3 వద్ద మొదలైన రూపాయి ట్రేడింగ్.. ఒకానొక దశలో 79.24 స్థాయికి కోలుకున్నది. అయినప్పటికీ తిరిగి 79.50 వద్దకు పతనమైంది. చివరకు 79.45 వద్ద స్థిరపడింది. శుక్రవారం 79.26 వద్ద ఉన్న విషయం తెలిసిందే. దీంతో 19 పైసలు నష్టపోయినైట్టెంది.
ఎఫ్ఐఐ పెట్టుబడులు వెనక్కి
విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు తరలిపోతుండటం కూడా రూపాయి విలువను దెబ్బతీస్తున్నది. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.4 వేల కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయాయి. సోమవారం ఒక్కరోజే రూ.170.51 కోట్ల విలువైన పెట్టుబడుల ఉపసంహరణ జరిగినట్టు ఎక్సేంజ్ వర్గాలు తెలిపాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెరుగుదల దేశంలో పెట్టుబడుల తగ్గుదలకు దారితీస్తున్నదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తుండగా, కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చక కూడా మదుపరులు వెనక్కిపోతున్నారన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
3 సెషన్లలో 51 పైసలు ఫట్
గడిచిన మూడు సెషన్లలో రూపాయి మారకం విలువ 51 పైసలు బలహీనపడింది. గురువారం 19 పైసలు, శుక్రవారం 13 పైసలు పడిపోయిన రూపాయి.. సోమవారం మరో 19 పైసలు క్షీణించి ఆల్టైం కనిష్ఠానికి చేరింది. దేశ, విదేశీ పరిణామాలు రూపాయి విలువను ప్రభావితం చేస్తుండగా.. పెరుగుతున్న దిగుమతులు మరింత ఒత్తిడిని తెస్తున్నాయి. చివరకు రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండటం ఆందోళన కలిగిస్తున్నది.
ఇక రూపీల్లో గ్లోబల్ ట్రేడింగ్
డాలర్తో చూస్తే రూపాయి మారకం విలువ నానాటికీ దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయ కరెన్సీ రూపాయిల్లో ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరిగేందుకు అదనపు ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను సెంట్రల్ బ్యాంక్ సోమవారం ఆదేశించింది. అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు రూపాయిల్లోనే భారత్తో వ్యాపార లావాదేవీలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ఓ సర్క్యులర్లో పేర్కొన్నది. అయితే ఈ మేరకు బ్యాంకులు ఏర్పాట్లు చేసేముందు ఆర్బీఐ ఫారిన్ ఎక్సేంజ్ శాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉన్నది. ‘భారత్తో జరిపే ఎగుమతి-దిగుమతుల్లో రూపాయిల్లోనే ఇన్వాయిసింగ్, పేమెంట్, సెటిల్మెంట్ తదితర లావాదేవీలను నిర్వహించేందుకు విదేశీ వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. కాబట్టి బ్యాంకులు ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి’ అని ఆర్బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది.
ప్రత్యేక రూపీ వోస్ట్రో ఖాతాలు
అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్ కోసం సంబంధిత భారతీయ బ్యాంకులకు ఆయా దేశాల వ్యాపారులకు చెందిన విదేశీ బ్యాంకుల్లో ప్రత్యేక రూపీ వోస్ట్రో ఖాతాలు అవసరమవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. దేశీయ దిగుమతిదారులు తమ వ్యాపార భాగస్వాములకు వారివారి దేశాల్లో ఉన్న బ్యాంక్ ప్రత్యేక వోస్ట్రో ఖాతాల్లో సొమ్మును జమ చేయాల్సి ఉంటుందని చెప్పింది. అలాగే భారత్ నుంచి దిగుమతులు చేసుకునే విదేశీ వ్యాపారులూ ఇక్కడి బ్యాంక్ వోస్ట్రో ఖాతాల్లో నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో రూపాయిల్లో విదేశీ దిగుమతిదారుల నుంచి తమ ఎగుమతుల కోసం దేశీయ ఎగుమతిదారులు అడ్వాన్స్ పేమెంట్లు తీసుకునేందుకు అవకాశమున్నది. స్పెషల్ వోస్ట్రో ఖాతాల్లోని మిగులు మొత్తాలు.. ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఎగుమతి-దిగుమతుల కోసం పేమెంట్స్కూ ఉపయోగపడతాయని ఆర్బీఐ చెప్తున్నది. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకూ దోహదం చేస్తుందంటున్నది.