IT | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కొత్త ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో ఎలాంటి మార్పుల్లేవని సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2024-25) మొదలైన విషయం తెలిసిందే. దీంతో ఐటీ విధానంలో అమల్లోకి రానున్న మార్పులు అంటూ సోషల్ మీడియా, ఆన్లైన్ వెబ్సైట్లలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ స్పందించింది. నిజానికి గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఆరంభం నుంచే కొత్త ఆదాయ పన్ను విధానంలో చేసిన సవరణలు అమల్లోకి వచ్చాయి. అయితే దీని మదింపు సంవత్సరాన్ని 2024-25గా పరిగణిస్తారు. దీంతో దాన్నే ఆర్థిక సంవత్సరంగా పొరబడి సోషల్ మీడియా, ఆన్లైన్ వెబ్సైట్లలో వార్తలు వండేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మదింపు సంవత్సరంగా 2025-26ను పరిగణిస్తారు.
ఇక నిరుడు ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకారం వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకే ఉంటే ఎలాంటి పన్నులు ఉండవు. రూ.3-6 లక్షలకు 5 శాతం, రూ.6-9 లక్షలకు 10 శాతం, రూ.9-12 లక్షలకు 15 శాతం, రూ.12-15 లక్షలకు 20 శాతం చొప్పున పన్ను ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.15 లక్షలు దాటితే 30 చెల్లించాలి. వ్యక్తిగత ట్యాక్స్ పేయర్స్ తమ ఐటీ రిటర్న్స్ను దాఖలు చేసేటప్పుడు కొత్త, పాత ఆదాయ పన్ను విధానాల్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డీఫాల్ట్గా కొత్త విధానాన్నే సిస్టమ్ పరిగణనలోకి తీసుకుంటుంది. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నా పన్నులు కట్టనవసరం లేదు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో).. ఉద్యోగుల పీఎఫ్ బ్యాలెన్స్ కోసం ఓ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను సోమవారం నుంచి అమల్లోకి తెచ్చింది. దీంతో మీరు ఉద్యోగాన్ని వీడి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కోసం వ్యక్తిగతంగా ఎలాంటి అభ్యర్థనలు, విజ్ఞప్తులు చేయనవసరం లేదు. ఈపీఎఫ్వోనే మీ పాత సంస్థ నుంచి కొత్త సంస్థ ఖాతాలోకి మీ బ్యాలెన్స్ మొత్తాన్ని బదిలీ చేస్తుంది. ఇదిలావుంటే ప్రభుత్వేతర ఉద్యోగుల కోసం లీవ్ ఎన్క్యాష్మెంట్ పన్ను మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కోసం పీఎఫ్ఆర్డీఏ అదనపు భద్రతా ప్రమాణాన్ని తెచ్చింది. సీఆర్ఏ సిస్టమ్లోకి వెళ్లాలంటే పాస్వర్డ్తోపాటు ఆధార్ అథెంటికేషన్ కూడా అవసరం.