IT Returns | న్యూఢిల్లీ, మార్చి 24: కొత్త ట్యాక్స్ విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్ వేసే వేతన జీవులకు కేంద్ర ఆర్థిక శాఖ స్వల్ప ఊరటనిచ్చింది. ఈ మేరకు శుక్రవారం లోక్సభ ఆమోదించిన ఫైనాన్స్ బిల్లులో చిన్న సవరణ చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే ఈ సవరణ ప్రకారం రూ.7 లక్షలకు మించి వార్షిక ఆదాయం కొద్దిపాటి పెరిగినప్పటికీ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ అంశంపై ఆర్థిక శాఖ, చార్టర్డ్ అకౌంటెంట్ల వివరణ ఇలా ఉంది..
డెట్ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్లు) పెట్టుబడులకు సంబంధించిన ఆదాయపు పన్ను విధానంలో మార్పులు చేస్తూ ఫైనాన్స్ బిల్లును సవరించారు. ఈ సవరణ ప్రకారం 2023 ఏప్రిల్ 1 తర్వాత డెట్ ఎంఎఫ్ స్కీమ్ల పెట్టుబడుల ద్వారా లభించే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం ఆధారంగా) ప్రయోజనం ఉండదు. అయితే అటువంటి ఎంఎఫ్లు వాటి మొత్తం ఆస్తుల్లో ఈక్విటీ పెట్టుబడులు 35 శాతాన్ని మించి చేయనివే ఈ ప్రయోజనాన్ని కోల్పోతాయి. అంటే అటువంటి డెట్ ఎంఎఫ్ స్కీమ్ల్లో మీరు చేసే పెట్టుబడులపై వచ్చే లాభాలపై మీ వ్యక్తిగత ఆదాయానికి ఉన్న శ్లాబ్ మేరకు పన్ను పడుతుంది. 2023 మార్చి 31 వరకూ ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం ప్రకారం డెట్ (బాండ్లు, రుణపత్రాలు) ఎంఎఫ్ యూనిట్లను మూడేండ్లలోపు విక్రయిస్తే/రిడీమ్ చేసుకోవడం ద్వారా వచ్చే లాభాలపై స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను పడుతుంది. అంటే మీ వ్యక్తిగత శ్లాబ్ మేరకు వర్తిస్తుంది. మూడేండ్లకు మించి యూనిట్లను అట్టిపెట్టుకుంటే వాటి లాభాలపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఇది 20 శాతం. స్థూలంగా చెప్పాలంటే 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ ఎంఎఫ్ల్లో (ఈక్విటీ పెట్టుబడులు 35 శాతాన్ని మించనవి) చేసే పెట్టుబడి లాభాలపై పన్నుకు ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు.
పన్ను ప్రయోజనాన్ని పొందాలనుకునే మదుపరులు ఈ నెలాఖరు దాకా డెట్ ఎంఎఫ్ల్లో పెట్టుబడి చేసుకుంటే అవి రిడీమ్ చేసుకునేటపుడు ఇండెక్సేషన్ లబ్ది చేకూరుతుందని ఈవై ఇండియా టాక్స్ పార్టనర్ సోనూ అయ్యర్ సూచించారు.