Spectrum | న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: స్పెక్ట్రమ్ వేలాన్ని టెలికం శాఖ 17 రోజులు వాయిదా వేసింది. మే 20 నుంచి జూన్ 6కు మార్చింది. ఈ మేరకు బుధవారం బిడ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనలో సవరించింది. లోక్సభ ఎన్నికల నడుమ ఇదిప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. అయితే బిడ్డింగ్లో పాల్గొనేవారి నగదు సమస్యలను తీర్చుతూ బ్యాంక్ గ్యారంటీ, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కోసం గ్యారంటీ మొత్తాలనూ టెలికం శాఖ తగ్గించింది. కానీ గ్యారంటీ చెల్లుబాటు తేదీని ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి సెప్టెంబర్ 30కి కుదించడం గమనార్హం. ఇదిలావుంటే జూన్ 3న మాక్ యాక్షన్ను నిర్వహించనున్నారు.
ఇంతకుముందు మే 13, 14 తేదీల్లో చేపట్టాలనుకున్నారు. పశ్చిమ బెంగాల్ సర్కిల్లో 900 మెగాహెట్జ్ శ్రేణిలో 44 బ్లాకులకే వేలాన్ని టెలికం శాఖ పరిమితం చేసింది. గతంలో 48 బ్లాకుల్లో యాక్షన్ పెట్టాలని చూశారు. కాగా, మొబైల్ ఫోన్ సేవల కోసం మొత్తం 8 స్పెక్ట్రమ్ శ్రేణుల్లో కేంద్ర ప్రభుత్వం రేడియో తరంగాలను వేలానికి పెడుతున్నది. కనీస ధర దాదాపు రూ. 96, 317 కోట్లుగా ఉన్నది. 800, 900, 1,800, 2,100, 2,300, 2,500, 3,300 మెగాహెట్జ్ బ్యాండ్లతోపాటు 26 గిగాహెట్జ్ బ్యాండ్లను వేలం వేస్తారు. గెలిచిన బిడ్డర్లు 20 ఏండ్లపాటు స్పెక్ట్రమ్ను వాడుకోవచ్చు.