Toys park | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక రంగంలో బహుముఖాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. బొమ్మల తయారీ పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందులోభాగంగానే ప్రత్యేకంగా నల్గొండ జిల్లా దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ క్లస్టర్లో టాయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ కోసం 75 ఎకరాలు కేటాయించింది. దీంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై టీఎస్ఐఐసీ దృష్టి సారించింది. ఈ టాయ్స్ క్లస్టర్లో రూ.100 కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో బొమ్మల తయారీ చేపడితే మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర పొరుగు రాష్ర్టాలకు ఎగుమతి చేసే వీలుంటుందనీ వారు చెప్తున్నారు. కాగా, ఆయా కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అధికారులతో చర్చలు జరుపుతుండటం విశేషం.
రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, లైఫ్సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ తదితర ప్రధాన రంగాల్లోకి భారీగా పెట్టుబడులు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొత్త ఉద్యోగాల కోసం తయారీ రంగాన్ని అధికంగా ప్రోత్సహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయా రంగాలపై దృష్టి కేంద్రీకరించింది. దీంతో ఆట బొమ్మల మార్కెట్ రోజురోజుకూ పుంజుకుంటున్నది గుర్తించింది. పైగా ఆట వస్తువుల ద్వారా ప్రాథమిక విద్యను బోధించేలా ఇప్పుడు అనేక రకాల బొమ్మలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వివిధ రకాల బొమ్మల ద్వారా అక్షరాలు, అంకెలు బోధించడం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఈ తరహా బొమ్మల తయారీ పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఇక బ్యాటరీతో తయారయ్యే బొమ్మలకు పిల్లలు ఎలా ఆకర్షితులవుతారో చెప్పనక్కర్లేదు. అందుకే బొమ్మల తయారీ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రస్తుతం దేశీయ టాయ్స్ మార్కెట్లో చైనా హవా నడుస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ.. స్థానికంగా బొమ్మల తయారీకి దన్నుగా నిలుస్తున్నది.
‘రాష్ట్రంలో బొమ్మలు తయారైతే చైనా నుంచి దిగుమతులను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది. స్థానికంగా ముడిసరుకు పుష్కలంగా లభిస్తుండటంతో తక్కువ ధరకు తయారుచేసి ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైల నుంచి హోల్సేల్గా కొని తెస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులూ భారమైపోతున్నాయి. బొమ్మల తయారీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తున్నందున రానున్న రోజుల్లో మన రాష్ట్రం బొమ్మల తయారీ కేంద్రంగా మారుతుందనడంలో ఆశ్చర్యం లేదు’
-జనార్ధన్, టాయ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు
బొమ్మల తయారీ కంపెనీల ప్రతినిధులతోపాటు రాష్ట్రంలోని వ్యాపారులు, సరఫరాదారులతో ఇటీవల పరిశ్రమల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రోత్సాహకాలు లభిస్తుండటంతో పరిశ్రమల ఏర్పాటుకు తయారీదారులు ఉత్సాహం కనబరుస్తున్నట్టు అధికారులు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన మరో ఐదారు నెలల్లో పూర్తవుతుందని, అనంతరం స్థలాల కేటాయింపు ప్రక్రియ చేపడుతామని వివరించారు. 75 ఎకరాల్లో కొత్తగా తెస్తున్న ఈ బొమ్మల తయారీ పార్క్ కోసం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టీఎస్ఐఐసీ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నది. ఇక్కడ సుమారు 100 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వీలుగా లే-అవుట్ను రూపొందించారు.
దేశంలో విక్రయిస్తున్న ఆట బొమ్మలలో 90 శాతం వరకు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇక రాష్ట్రంలో బొమ్మల మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లకుపైనేనని అంచనా. అయితే తెలంగాణలో నిర్మల్ చెక్క బొమ్మల తయారీ పరిశ్రమను మినహాయిస్తే.. నోయిడా, ముంబై, కర్నాటక తదితర ప్రాంతాల్లో నుంచి హోల్సేల్గా దిగుమతి అవుతున్న బొమ్మలే ఎక్కువ. కాగా, దేశంలో సుమారు 5 లక్షల మంది కళాకారులు బొమ్మల తయారీలో కొనసాగుతుండగా, 75 శాతం కంపెనీలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రంగానికి (ఎంఎస్ఎంఈ) చెందినవే ఉన్నాయి. ఇదిలావుంటే బొమ్మల తయారీకి అవసరమైన ప్లాస్టిక్, కాటన్, చెక్క తదితర ముడిసరుకు తెలంగాణలో పుష్కలంగా ఉండటంతో మన రాష్ట్రంలో ఈ పరిశ్రమ విస్తరణకు మంచి అవకాశాలున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.