ముంబై, మే 10: ఫార్మా, మెటల్, ఇంధన షేర్లలో జరిగిన కొనుగోళ్ల ఫలితంగా వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ పెరిగింది. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 296 పాయింట్లు లాభపడి 49,502 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 119 పాయింట్లు జంప్చేసి 14,942 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్-30 షేర్లలో అత్యధికంగా ఇంజనీరింగ్ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో 4 శాతం పెరిగింది. డాక్టర్ రెడ్డీస్లాబ్, సన్ఫార్మా, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్బ్యాంక్, పవర్గ్రిడ్, ఓఎన్జీసీ, ఎం అండ్ ఎంలు లాభపడిన షేర్లలో వున్నాయి. దేశంలో కొవిడ్-19 కేసులు పెరుగుదల, కొన్ని రాష్ర్టాల్లో లాక్డౌన్ విధింపు వంటి ప్రతికూలతలను అధిగమించి, ఈక్విటీలు వరుసగా నాల్గవరోజు ర్యాలీ జరిపాయని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ బినోద్ మోది చెప్పారు.
రూ.6.44 లక్షల కోట్లు పైకి
స్టాక్ మార్కెట్ల వరుస లాభాల నేపథ్యంలో మదుపరుల సంపద కూడా పెరిగింది. బీఎస్ఈలోని సంస్థల మార్కెట్ విలువ గడిచిన నాలుగు రోజుల్లో రూ.6 లక్షల 44,760.45 కోట్లు ఎగిసింది. దీంతో బీఎస్ఈ నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.2 కోట్ల 13 లక్షల 28,658.05 కోట్లకు చేరింది.