ముంబై, జనవరి 2: గతవారం కాస్త బలపడిన రూపాయి మారకపు విలువ ఈ వారం మళ్లీ దిగువబాట పట్టింది. వరుసగా రెండు రోజులూ క్షీణించింది. మంగళవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో బలహీనంగా ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83.35 వరకూ తగ్గింది. చివరకు క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 11 పైసలు నష్టపోయి 83.32 వద్ద ముగిసింది. సోమవారం ఇది 5 పైసలు తగ్గిన సంగతి తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్ నెలకొనడం, దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడటం రూపాయి తగ్గుదలకు కారణమని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధర పెరగడం, యూఎస్ డాలర్ బలపడటంతో దేశీయ కరెన్సీ క్షీణించిందని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌధరి చెప్పారు. డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 101.44 వద్దకు చేరగా, ప్రపంచ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర 2.13 శాతం మేర ఎగిసి 78.68 డాలర్ల వద్దకు పెరిగింది.
83.20-83.50 శ్రేణిలో హెచ్చుతగ్గులు
అమెరికాలో బుధవారం వెలువడనున్న కీలకమైన తయారీ, సర్వీసుల పీఎంఐ గణాంకాలపై ఫారెక్స్ ట్రేడర్లు దృష్టినిలిపారని, దీంతో రూపాయి ఒడిదుడుకులకు లోనుకావచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు. డాలర్-రూపాయి స్పాట్ ధర 83.20-83.50 శ్రేణిలో ట్రేడ్ అవుతుందని అంచనా వేశారు. ఎర్ర సముద్రంలో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి విలువ 83.10-83.70 శ్రేణిలో కదలవచ్చని అంచనా వేస్తున్నట్టు అనూజ్ చౌధరి చెప్పారు.