ముంబై, జూన్ 4: రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షను శుక్రవారం ప్రకటించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రెండో ద్వైమాసిక పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు మెండుగావున్నాయని, లేకపోతే వడ్డీరేట్లను పావు శాతం పెంచే అవకాశం ఉన్నదని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమనడంతో ధరల సూచీ ఆకాశమే హద్దుగా దూసుకుపోయే అవకాశాలుండటం ఈసారి సమీక్షలో రిజర్వుబ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నిర్ణయం కీలకంగా మారింది. ఆరుగురు సభ్యులు కలిగిన పరపతి సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమై శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించనున్నది.
ఈ సమీక్షపై పీటీఐ నిర్వహించిన పోల్లో పలువురు ఆర్థిక వేత్తలు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. వీరిలో 11 మంది వడ్డీరేట్ల యథాతథ స్థితికి ఓటు వేయగా, నలుగురు మాత్రం పావు శాతం పెంచే అవకాశం ఉన్నదని తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ద్రవ్యోల్బణ రిస్క్ కారణంగా ఈ ఏడాది సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను రెండు సార్లు సవరించే అవకాశాలున్నాయని అత్యధిక మంది అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ..దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటంతో ఆర్బీఐ కూడా ఈసారి వడ్డీరేట్లను స్థిరంగా ఉంచే అవకాశాలున్నాయన్నారు.