న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశంలో డాలర్ మిలియనీర్ల సంఖ్య 2026 నాటికి రెట్టింపునకుపైగా పెరుగుతుందని ఈ ఏడాదికిగాను విడుదలైన క్రెడిట్ సూసీ గ్లోబల్ వెల్త్ రిపోర్టు చెప్తున్నది. గత ఏడాది భారత్లో 7.96 లక్షల డాలర్ మిలియనీర్లున్నారు. 2026లో వీరు 105 శాతం వృద్ధితో 16.32 లక్షలకు చేరుతారని క్రెడిట్ సూసీ తాజా నివేదికలో అంచనా వేసింది. ఇదే సమయంలో చైనాలో 97 శాతం వృద్ధి ఉండనుందన్న క్రెడిట్ సూసీ.. అమెరికాలో 13 శాతమేనని చెప్పింది. ఇదిలావుంటే దేశ పౌరుల సంపదలో వృద్ధి 2000 సంవత్సరం నుంచి చూసినైట్టెతే ఆకర్షణీయంగా ఉందని, సగటున ఏటా 8.8 శాతం ఎగబాకి నిరుడు చివరినాటికి 15,535 డాలర్లను తాకిందని క్రెడిట్ సూసీ ఈ సందర్భంగా వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా 8.7 కోట్లకు..
ప్రపంచవ్యాప్తంగా డాలర్ మిలియనీర్లు 2026 నాటికి 8.7 కోట్లకు పెరుగుతారని క్రెడిట్ సూసీ పేర్కొన్నది. 2021 ఆఖరుకల్లా 6.25 కోట్లుగా ఉన్నారు. దీంతో ఈ ఐదేండ్లలో దాదాపు 2.5 కోట్ల మంది పెరగనున్నారని చెప్తున్నది. కాగా, డాలర్ మిలియనీర్లలో అత్యధికంగా 39 శాతం మంది అమెరికాలోనే ఉన్నారు. చైనా రెండో స్థానంలో ఉండగా, 1 శాతంతో భారత్ ఉన్నది. ‘జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియాల్లో డాలర్ మిలియనీర్లు పెరిగే అవకాశాలు లేవు. అయితే కొరియా, తైవాన్, భారత్, హాంకాంగ్ దేశాల్లో పెరుగుతారు. ముఖ్యంగా ఇండియాలో రెట్టింపు అవుతారని భావిస్తున్నాం’ అని క్రెడిట్ సూసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.