Credit Cards | సరిగ్గా ఏడేండ్ల క్రితం పాతపెద్ద నోట్ల (రూ.1000, రూ.500) రద్దు.. నాలుగేండ్ల క్రితం ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత అంతా డిజిటల్ చెల్లింపులు.. ఆన్ లైన్ పేమెంట్సే.. యూపీఐతో మొబైల్ యాప్స్ ద్వారా రోజురోజుకు డిజిటల్ చెల్లింపులు పెరిగిపోతున్నాయి. దాంతోపాటు క్రెడిట్ కార్డులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో క్రెడిట్ కార్డుల హోల్డర్ల సంఖ్య 10 కోట్ల మార్క్ను దాటేస్తుందని అంచనా. గత ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 8.65 కోట్ల క్రెడిట్ కార్డులతో ప్రజలు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇది ఆల్ టైం హై. గతేడాది ఏప్రిల్ నాటికి 7.5 కోట్ల క్రెడిట్ కార్డులు (దాదాపు 15 శాతం) ఉన్నాయని ఆర్బీఐ డేటా, బ్యాంక్ బజార్ నివేదిక చెబుతున్నది.
మార్కెట్ వాటా ప్రకారం గత ఏప్రిల్లోనే యాక్సిస్ బ్యాంక్ కార్డు యూజర్లు గరిష్టంగా ట్రాన్సాక్షన్లు నిర్వహించారు. సిటీ బ్యాంక్ టేకోవర్తో యాక్సిస్ బ్యాంక్ లబ్ధి పొందింది. మొత్తం క్రెడిట్ కార్డుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకులు మాత్రమే గత ఏప్రిల్ నాటికి 71 శాతం క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నాయి. ఏప్రిల్ నెలలో సగటున ఒక్కో క్రెడిట్ కార్డుపై రూ.5,120 ఖర్చు చేశారు.
భారీ కొనుగోళ్లు, రివార్డు పాయింట్లపై బెనిఫిట్లు, క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ప్రీమియం లైఫ్ స్టైల్ రివార్డ్స్ ఉపయోగించుకోవడానికే యూజర్లు క్రెడిట్ కార్డుల వాడకం పెంచారని తెలుస్తున్నది.
గత ఏప్రిల్ నెలలో డెబిట్ కార్డులను దాటేసి క్రెడిట్ కార్డుల వాడకం నిలిచింది. 25 కోట్ల మర్చంట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. గతేడాది 22 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగాయి. ట్రావెలింగ్, ఎలక్ట్రానిక్స్ పరికరాల కొనుగోళ్లు, డైనింగ్, షాపింగ్ కోసం ప్రజలు తమ క్రెడిట్ కార్డుల వాడకానికి మొగ్గు చూపుతున్నారు.
గత ఏప్రిల్ నెలలో డెబిట్ కార్డుల వాడకం పెరిగినా, ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయాయని బ్యాంక్ బజార్ సీఈఓ అదిల్ శెట్టి చెప్పారు. బ్యాంకు డెబిట్ కార్డులకు గత ఏప్రిల్ నెలలో కొత్తగా 4.6 కోట్లు జత కలిశాయి. దీంతో దేశంలో ఉన్న డెబిట్ కార్డుల సంఖ్య 96 కోట్లకు చేరుకున్నది. గత ఏడాది కాలంలో రూ.55 వేల కోట్ల లావాదేవీలు (16 శాతం తగ్గుదల) నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య కూడా 30 శాతం తగ్గి 23 కోట్లకు పరిమితమైందని అదిల్ శెట్టి తెలిపారు.